Friday, March 29, 2024

రోడ్ల నిర్మాణంతో అభివృద్ధి వేగవంతం..

రామచంద్రాపురం : ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవుటర్‌ రింగ్‌రోడ్డుకు అనుసందానంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేడియల్‌ రోడ్లకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న రేడియల్‌ రోడ్డును ఆయన మున్సిపల్‌ చైర్మన్‌ లలితసొమిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ రాములుగౌడ్‌, పలువురు కౌన్సిలర్లు, స్థానిక అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రస్తుతం వేస్తున్న రేడియల్‌ రోడ్డు ఉస్మాన్‌నగర్‌లోని స్మశానవాటిక మీదుగా వెళ్తుండటంతో ఆయన పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ గ్రామమైనా అభివృద్ధి చెందాలంటే మౌళిక వసతులతో పాటు రవాణా వ్యవస్థ ఉన్నప్పుడే సాధ్యమవుతుందన్నారు. ఒక ప్రాంతం నుంచి మరోక ప్రాంతానికి రవాణా వ్యవస్థ ఉంటే వివిధ ప్రాంతాల వారు సులువుగా రాగల్గుతారని, వ్యాపార, వాణిజ్యా సముదాయాలు ఏర్పడతాయన్నారు. రవాణా వ్యవస్థపైనే అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుందని, ఉస్మాన్‌నగర్‌ లో రేడియల్‌ రోడ్డు వల్ల స్మశానస వాటికకు ఇబ్బందులు కలుగకుండా సంబంధిత శాఖా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు. రేడియల్‌ రోడ్ల నిర్మాణాలు పూర్తయిన తర్వాత తెల్లాపూర్‌ మున్సిపాలిటీ రూపురేఖలే మరిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమీషనర్‌ డాక్టర్‌ వెంకటమణికరణ్‌, కౌన్సిలర్లు చిట్టి ఉమేశ్వర్‌, లచ్చిరాంనాయక్‌, శ్రీకాంత్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement