Tuesday, April 23, 2024

Cricket | ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌, అయ్యర్‌ అదరహో

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ పేలవ ప్రదర్శనతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ర్యాంక్‌ దిగజారిపోయింది. అలాగే అద్భుత ప్రదర్శన చేసిన శ్రేయస్‌ అయ్యర్‌ తన కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకొన్నాడు. బ్యాటింగ్‌ విభాగంలో కోహ్లీ 12వ స్థానం నుంచి 14వ ర్యాంక్‌కు పడిపోయాడు. శ్రేయస్‌ అయ్యర్‌ ఏకంగా 10 స్థానాలను మెరుగుపర్చుకొని 16వ ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. ఆసీస్‌ బ్యాటర్‌ లబుషేన్‌ (936) అగ్రస్థానం దక్కించుకోగా. బాబర్‌ అజామ్‌ (875), స్టీవ్‌ స్మిత్‌ (870) ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు.

భారత్‌ తరఫున రిషభ్ పంత్‌ (797) ఆరో స్థానం, కెప్టెన్ రోహిత్‌ శర్మ (732) మాత్రమే టాప్‌-10లో చోటు సంపాదించారు. బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసినప్పటికీ పుజారా మాత్రం మూడు స్థానాలను కోల్పోయి 19వ ర్యాంక్‌కు పరిమితమయ్యాడు. బంగ్లాపై రెండో టెస్టులో వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడిన రవిచంద్రన్‌ అశ్విన్‌ ర్యాంకింగ్స్‌లోనూ దూసుకెళ్లాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో అశ్విన్‌ (343) తన రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకొన్నాడు. అయితే షకిబ్‌ (329) కంటే పాయింట్లను మెరుగుపర్చుకొన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా టాప్‌ ఆటగాడు రవీంద్ర జడేజా (369)దే అగ్రస్థానం. ఇక బౌలర్ల విభాగంలోనూ అశ్విన్‌ (812) ఐదో స్థానానికి చేరుకొన్నాడు. టాప్‌-5లో ఏకైక స్పిన్నర్‌ అశ్విన్‌ కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement