Sunday, March 24, 2024

అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే..

జిన్నారం : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన జిన్నారం, శివనగర్‌లలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బాల్యం నుండి వివక్షను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో అస్పృశ్యతను నివారిర్చడం నుండి మానవ సమాజాన్ని సమైక్యం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘసంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహా నాయకుడు అంబేద్కర్‌ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, ఎంపీపీ రవీందర్‌గౌడ్‌, అమీన్‌పూర్‌ ఎంపీపీ దేవానందం, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పాలక వర్గాల సభ్యులు, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు వెంకటేష్‌గౌడ్‌, పార్టీ మండల అధ్యక్షులు రాజేష్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement