Thursday, April 25, 2024

ఐక్యంగా, లౌక్యంగా గెల‌వాలి – జ‌గ‌న్ వ్యూహం…

అమరావతి, : మున్సిపల్‌ ఎన్నికలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రెండు రోజులుగా ఆయన మున్సిపాలిటీలవారీగా నివేదికలు తెప్పించుకుని గెలుపోటములపై బేరీజు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ నేతల మధ్య సమన్వయం కొరవడిందో అక్కడ ఆయా నేతలతో ఆయనే స్వయంగా మాట్లాడి, పరిస్థితిని చక్క దిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇది నిజమే అనడానికి మూడు రోజుల క్రితం విజయవాడలో మంత్రి వెల్లంపల్లి, మాజీ సమన్వయకర్త ఆసీఫ్‌లను క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్నారు. వీరిద్దరి మధ్య వివాదానికి సంబం ధించి ఇద్దరినీ నేరుగా క్యాంపు కార్యాలయానికి పిలిపించి మందలించినట్లు తెలిసింది. ఇక ఇదే పరిస్థితులను ఆయన రాష్ట్రం లోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల పరిధిలో అవలంబిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌, బావమరిది బాలకృష్ణ వరుపబెట్టి రోడ్‌షోలు నిర్వహిస్తుండటం, అర్బన్‌ ప్రాంతంలో తమకు పట్టుందని నిరూపించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని సీఎం జగన్‌ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారంలో తాను నేరుగా పాల్గొనే పరిస్థితిలేదని, ప్రజల మద్దతు తనకు ఉందని, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ విజయం సాధించి తీరుతామని సీఎం జగన్‌ ధృఢ నిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. గెలుస్తామని ధైర్యం ఉన్నప్పటికీ నేతల మధ్య నెలకొన్న అంతరాలు కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశమున్నందున వాటిని సరిద్ది పట్టణ ఓటర్ల కూడా తమకే మద్దతు ఇస్తున్నారని తెలియజేసేందుకు సీఎం జగన్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
మూడు చోట్ల సమస్య
రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, గుంటూరు కార్పొరేషన్లలో పార్టీ నేతల మధ్య నెలకొన్న విభెెదాలు సమస్య కాబోతున్నాయని ముఖ్యమంత్రికి సమా చారం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మూడు కార్పొ రేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ నేతల మధ్య నెలకొన్న విభే దాలు ఓటమికి కారణం కాకూడదని ఆయన కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలిసింది. దీనికితోడు ఉత్తరాం ధ్రలోని విజయ నగరంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. వీటన్నింటి నడుమ తానే స్వయంగా రంగంలోకి దిగి, నేతల మధ్య సమన్వయం చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. అతి త్వరలోనే ఆయన వీరందరినీ నేరుగా పిలిపించి మాట్లాడే అవకాశం కూడా లేకపోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు సహకరించ కపోయినా..తాను సంక్షేమ పథకాలను నిర్విరామంగా అమలు చేస్తున్నానని, అందుకే ప్రజలంతా పంచాయతీ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచారని సీఎం జగన్‌ తన సన్నిహితుల మధ్ద అన్నట్లు తెలిసింది. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ప్రజలు తమకు అనుకూలంగానే ఉన్నారని, దానిని మనం ఉపయోగించుకోలేకపోతే తప్పిదం మనదే అవుతుందని సీఎం జగన్‌ అన్నట్లు తెలిసింది.
ఎక్కడైనా ఇరువురి మధ్య విభెెదాలు ఉండటం సహజమేనని, అయితే, మనం బలపడే సమయంలో ఈ విభేదాలతో పార్టీకి చెరుపుచేసే పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని సీఎం అన్నట్లు సమాచారం. ఎక్కడెక్కడ నేతల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ ప్రత్యేక ప్రతినిధులను పంపి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ఇప్పటికే విజయవాడ, విశాఖ, గుం టూరు వంటి ప్రాంతాల్లో ప్రతి కార్పొరేటర్‌ అభ్యర్ధి తరపున ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రచారం చేస్తున్నారు. విజ యవాడలో శనివారం సినీ నటుడు ఆలీ కూడా ప్రచారం నిర్వహించారు.
తప్పని రెబల్స్‌ బెడద
ఇదిలావుండగా చాలా ప్రాంతాల్లో పార్టీకి రెబల్స్‌ బెడద తప్పడం లేదు. కొన్ని కొన్ని చోట్ల ఆయా జిల్లాల మంత్రులు స్వయంగా రంగంలోకి దిగి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఈనేపథ్యంలో మంత్రులు కూడా కొంత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు మరో 48 గంటలు మాత్రమే వ్యవధి ఉండటంతో మంత్రులు ఇప్పుడు బుజ్జగింపుల పర్వాన్ని పక్కనబెట్టి గెలుపుకు వ్యూహాలు రచించే పనిలో ఉన్నట్లు సమా చారం.
తెదేపాలో విభేదాలు అందిపుచ్చుకోవాలి
రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల పరిధిలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో నెలకొన్న విభెెదాలను తమకు అనుకూలంగా మలచుకునే పనిలో అటు మంత్రులు, ఇటు పరిశీలకులు పడ్డారు. విజయవాడ, విశాఖ తదిర ప్రాంతాల్లో ఇప్పటికే ఈ అం శంలో వారు విజయం సాధించారు. మిగతా చోట్ల కూడా ఇదే ఫార్ములా ఉప యోగించి లబ్దిపొందేందుకు పావులు కదు పుతున్నారు.
మంత్రులకు కీలక బాధ్యతలు
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులుగా ఉన్న వారికి ఆయా జిల్లాల పరిధిలో మున్సిపాలిటీల్లో గెలుపుపై సీఎం జగన్‌ కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే ప్రతి మున్సిపాలిటీకి పార్టీ నుండి ఒక పరిశీలకుని నియమించారు. వారు నిత్యం ఆయా మున్సిపాలిటీ పరిధిలో పర్యటించి ఉన్న పరిస్థితులను ఆయా ఇన్‌ఛార్జి మంత్రికి వివరిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య ఉన్న అంతరాలను వారు జోక్యం చేసుకుని తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వయంగా మంత్రి పిలిపించి మాట్లాడు తుండటంతో వారు వారికున్న ఇబ్బందులను, ఎక్కడ లోపాన్ని చక్కదిద్దేతే విజయం సాధ్యమవుతుందో మంత్రులకు తెలియజేస్తు న్నారని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement