Tuesday, April 23, 2024

హుజురాబాద్ ఉపఎన్నిక: ఈసీకి షర్మిల లేఖ

హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌కు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల లేఖ రాశారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌ను తొలగించాలి, స్థానిక పోలీస్‌ కమిషన్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఇతర వర్గాల వారు నామినేషన్లు వేయకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్లకు దరఖాస్తులు కూడా ఇవ్వడం లేదని, అభ్యర్థి మద్దతుదారులను స్థానిక మండలాల పోలీసులతో బెదరించి, వెనక్కి పంపిస్తున్నారని చెప్పారు. అభ్యర్థులు, మద్దతుదారులను కోవిడ్‌ నిబంధనల పేరుతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించినా.. ఏదో ఒక కారణంతో పోలీసులు వెనక్కి పంపిస్తున్నారని చెప్పారు. రెండు డోసుల వ్యాక్సిన్‌ పూర్తి చేసుకుంటేనే నామినేషన్లకు అర్హులని చెబుతున్నారని, రెండు డోసుల మధ్య ఉన్న సమయంతో నామినేషన్లు వేసే అవకాశం కూడా ఉండదు కదా? అని ప్రశ్నించారు. రెండు డోసులు వేశాకే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని షర్మిల డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: డ్వాక్రా మహిళలను మోసం చేశారు: చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్

Advertisement

తాజా వార్తలు

Advertisement