Friday, April 19, 2024

దేశ రక్షణలో యువత ముందుండాలి – మంత్రి జగదీష్ రెడ్డి

దేశ రక్షణలో యువతరం భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకు కల్నల్ సంతోష్ బాబును స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని ఆయన యువతీ యువకులకు విజ్ఞప్తి చేశారు. కల్నల్ సంతోష్ బాబుకు స్ఫూర్తి ఆయన తల్లి తండ్రులేనని నేటి యువతీ యువకులకు మాత్రం సంతోష్ బాబు స్ఫూర్తి అని ఆయన చెప్పుకొచ్చారు. అర్మీలో సిపాయి నుండి ఉన్నతాధికారి ఎంపికలకు గాను సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యస్ వి కళాశాల క్రీడా మైదానంలో ది సోల్జర్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన సభా కార్యక్రమాన్ని దివంగత కల్నల్ సంతోష్ బాబు చిత్రపటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రసంగిస్తూ… జిల్లాగా రూపాంతరం చెందిన సూర్యాపేట జిల్లా కేంద్రంలో మొట్టమొదటి సారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందన అనూహ్యమైనదని ఆయన వర్ణించారు. పట్టణానికి చెందిన దివంగత సంతోష్ బాబు త్యాగంతో ప్రపంచ చిత్ర పటంలో సూర్యాపేటకు చోటు దక్కిందన్నారు. అటువంటి సంతోష్ బాబును స్ఫూర్తిదాయకంగా పెట్టుకుని ఈనాటి ర్యాలీకి తరలివచ్చిన వారందరినీ ఆయన అభినందించారు. ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్న రోజునే యువత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుంటుందని ఆయన చెప్పారు.

అందుకు భిన్నంగా క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమాజం, దేశం మనదే అని గలిగినప్పుడు మాత్రమే భవిష్యత్ ఉంటుందని ఆయన చెప్పారు. అటువంటి భవిష్యత్ కల్పించేందుకు ఆర్మీ దోహదపడుతుందన్నారు. సిపాయి ఉద్యోగం నుండి ఉన్నతాధికారి ఎంపిక వరకు ఇకపై సూర్యా పేటలోనే ఉంటుందని ఆయన వెల్లడించారు. అటువంటి ఉద్యోగాల ఎంపిక కోసం ది సోల్జర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ర్యాలీలో ఎంపికై రెండు నెలల పాటు శిక్షణ పొందనున్న వారికి శిక్షణా కాలంలో భోజ‌న‌ సౌకర్యాలు సొంతంగా భరించనున్నట్లు ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన యువతీ, యువకుల హర్షధ్వనాల నడుమ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, యస్ పి రాజేంద్రప్రసాద్ ది సోల్జర్ యూత్ ఫౌండేషన్ ఫౌండర్ కల్నల్ యస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


అందరికీ అల్పాహారం అందించండి – మంత్రి జగదీష్ రెడ్డి
ఇదిలా ఉండగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మొట్టమొదటి సారిగా నిర్వహించిన ఆర్మీ ఫ్రీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొన్న వారందరికీ అల్పాహారం అందించాలని మంత్రి జగదీష్ రెడ్డి తన వ్యక్తిగత అనుచరులకు సూచించారు. మొట్టమొదటి సారిగా జరుగుతున్న ఈ ర్యాలీలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భారీ ఎత్తున యువతీ యువకులు హాజరు కావడం నిర్వాహకులు ముందుగా ఊహించలేక పోయారు. ఆర్మీ ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఉండాలని పట్టుబట్టి సాధించిన మంత్రి జగదీష్ రెడ్డి సైతం కార్యక్రమానికి వచ్చిన స్పందనతో సంతోషం వ్యక్తం చేశారు. అటువంటి తరుణంలో ఈ ఉదయం నిర్వహించిన ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన యువతీ యువకులకు అల్పాహారం అందించాలంటూ ఆయన అనుచరులకు సూచించడంతో అప్పటికప్పుడు పట్టణంలోని హోటళ్ల నుండి తెప్పించి అందజేశారు. రెండు నెలల శిక్షణా కాలంలో భోజనాది సౌకర్యాలు కల్పించేందుకు స్వచ్చందంగా ముందుకు రావడంతో పాటు ఈ ఉదయం 7 గంటలకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఆర్మీ ఫ్రీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అల్పాహారం అందించిన మంత్రి జగదీష్ రెడ్డికి హాజరైన ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement