Thursday, April 25, 2024

గోదారి ఒడ్డునే మాతా, శిశు సంర‌క్ష‌ణా కేంద్రం.. వ‌ర‌ద‌లు రావ‌డంతో ఆస్ప‌త్రి నుంచి రోగుల త‌ర‌లింపు!

అట‌వీ గ్రామాలు, లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న గ‌ర్భిణులు, అత్య‌వ‌స‌ర వైద్యం అందాల్సిన వారిని పోలీసులు, ఇత‌రులు ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నారు. అయితే.. మంచిర్యాల జిల్లాలో మాత్రం దీనికి వ్య‌తిరేకంగా ఉంది ప‌రిస్థితి. ఎందుకంటే ఇక్క‌డి మాతా శిశు సంర‌క్ష‌ణ కేంద్రంలోకి వ‌ర‌ద రావ‌డ‌మే కార‌ణం. గోదావ‌రి ఒడ్డునే ఈ హాస్పిట‌ల్ ఉండ‌డంతో ఎప్పుడు వ‌ర‌ద‌లు వ‌చ్చినా ఇక్క‌డ ట్రీట్‌మెంట్ పొందుతున్న వారికి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. కాగా, ఈసారి గోదావ‌రి మ‌హోగ్ర‌రూపం దాల్చి ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుండ‌డంతో ఆ ఆస్ప‌త్రిలో ఉన్న వారిని వేరే చోటుకి త‌ర‌లిస్తున్నారు.

మంచిర్యాల జిల్లాలో మాతా శిశు సంరక్షణా కేంద్రం నుంచి రోగులను తరలించారు. గోదావరి వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మాతా శిశు సంరక్షణా కేంద్రం గోదావరి ఒడ్డునే ఉంటుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద భారీగా వస్తున్న నేపథ్యంలో గేట్లు ఎత్తారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వరద పెరిగితే క‌చ్చితంగా మాతా శిశు సంరక్షణా కేంద్రాన్ని ముంచెత్తుతుంది. దీంతో మాత శిశు ఆసుపత్రి లో ఉన్న వారిని స్వచ్ఛందంగా మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి కాంగ్రెస్ నాయకులు తరలిస్తున్నారు.

మంచిర్యాల పట్టణానికి ఎగువనే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంటుంది. అటు కాలేశ్వరం జలాలు, ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ఉధృతితో, నీరంతా మంచిర్యాల కాలేజీ రోడ్ ఏరియా, ఎన్టీఆర్ నగర్ ను ముంచెత్తుతుంది. వరద ఉధృతి పెరుగిన‌ ప్రతిసారి మాతా శిశు సంరక్షణా భవనంలోకి నీరు చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పుడు వరద ప్రవాహం పెరిగి నేరుగా ఈ కేంద్రంలోకి నీళ్లొస్తాయి. ఇలా వరదలు వచ్చిన ప్రతిసారి రోగులను తరలిస్తే పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనికి పూర్తి స్థాయి ప్రత్యామ్నాయం ఆలోచించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement