Friday, April 26, 2024

కాంగ్రెస్ లో రచ్చ.. కొట్టుకున్న కొండా మురళి, ఎర్రబెల్లి స్వర్ణ వర్గీయులు

వ‌రంగ‌ల్‌లో కాంగ్రెస్ నేత‌లు వ‌ర్గాలుగా విడిపోయి బాహాబాహికి దిగారు. వ‌రంగ‌ల్ డీసీసీ అధ్యక్షురాలిగా మాజీ వ‌రంగ‌ల్ మేయ‌ర్‌ ఎర్రబెల్లి స్వర్ణ బుధ‌వారం బాధ్యతలు స్వీక‌రిస్తున్న తొలి స‌మావేశంలోనే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. వ‌రంగ‌ల్ జిల్లా ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ సంతోష్‌కు, ప‌ర‌కాల‌కు చెందిన కాంగ్రెస్ క‌ట్ల స్వామికి మ‌ధ్య వాగ్వాదం మొద‌లై ఘ‌ర్షణకు దారితీసింది. పార్టీలో ఎస్సీల‌కు ప్రాధ్యాన్యత ఇవ్వడం లేదంటూ క‌ట్లస్వామి ప‌రుష ప‌ద‌జాలంతో మాట్లాడటాన్ని ప్రశ్నించిన త‌న‌పై దాడికి పాల్పడ్డాడంటూ సంతోష్ ఆరోపించారు. క‌ట్ల స్వామి కొండా ముర‌ళీ వ‌ర్గానికి చెందిన నేత‌గా తెలుస్తోంది. కార్యక్రమానికి హాజ‌రైన నేత‌ల్లో ప‌దుల సంఖ్యంలో రెండు వ‌ర్గాలుగా విడిపోయి ప‌ర‌స్పరం చెప్పులతో దాడి చేసుకున్నారు.

పిడిగుద్దుల‌తో విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి స్వర్ణ భర్త రాజేశ్వరరావు జోక్యం చేసుకున్నారు.ఇరు వర్గాలను శాంతింప చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవిని కొండా మురళి దంపతులు తమ వర్గానికి చెందిన నేతకు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. అయితే పార్టీ నాయకత్వం ఎర్రబెల్లి స్వర్ణకు పదవి అప్పగించింది. ఈ విషయమై తమకు సహకరించాలని కొండా మురళి దంపతులకు ఎర్రబెల్లి స్వర్ణ దంపతులు కోరారు. ఇందుకు కొండా దంపతులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఓ ఫంక్షన్ హల్‌లో ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఇద్దరు నేతల మధ్య వ్యక్తిగత గొడవ కారణంగా ఘర్షణ జరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement