Friday, March 29, 2024

గ్రామాల అభివృద్ధిలో రాజీపడే ప్రసక్తే లేదు : ఎమ్మెల్యే అరూరి రమేష్

హాసన్ పర్తి, ఐనవోలు మండలాల పరిధిలో చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అధికారులను, ప్రజా ప్రతినిధులను ఆదేశించారు. హాసన్ పర్తి మండలానికి సంబందించి భీమారం డీవీఆర్ గార్డెన్స్ లో, అలాగే ఐనవోలు మండలానికి సంబందించి ఐనవోలు మండల కేంద్రంలో హాసన్ పర్తి, ఐనవోలు మండలాల అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులు, మండల ప్రజా ప్రతినిధులతో ఎమ్మెల్యే అరూరి రమేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామాల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అధికారులు, ప్రజా ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని, అలాగే అభివృద్ధి పనులలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా పరిధిలోని హాసన్ పర్తి, ఐనవోలు మండలాలలోని ప్రతీ గ్రామంలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి విషయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలనీ తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలను ఆదర్శ మండలాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు ప్రతీ ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. అనంతరం ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాడమే కాకుండా, పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిగా పని చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపిపిలు, జడ్పి టీసిలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపిటిసిలు, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement