Tuesday, April 16, 2024

స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచానికి చాటాలి : ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘన్ పూర్ : భారత స్వాతంత్ర్య‌ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే లక్ష్యంతోనే స్వాతంత్ర్య‌ భారత వజ్రోత్సవాల కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం డివిజన్ కేంద్రంలోని అన్ని శాఖల అధికారులు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య‌ వజ్రోత్సవాల్లో భాగంగా చేపట్టిన ఫ్రీడం ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా బాబు జగ్జీవన్ విగ్రహం నుంచి రైల్వే గేటు వరకు ఆ ఫ్రీడం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలాలు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ ఫలమని తెలిపారు.

జాతీయ ఉద్యమమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ ఆనాడు ఉద్యమ రథసారథిగా తెలంగాణను సాధించారని ఈ సందర్బంగా గుర్తుచేశారు. నేటి యువత నాటి స్వాతంత్ర్య‌ ఉద్యమ స్ఫూర్తి, నేటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కూడా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రజా స్వామ్యంలో హింసకు తావులేదని శాంతియుత మార్గంలోనే దేనినైనా సాధించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ డీ.రఘుచందర్, ఎంపీపీ కందుల రేఖ, జడ్పీటీసీ రవి, సీఐ ఏడవల్లి శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ పూల్ సింగ్ చౌహన్, ఎస్ఐ శ్రవణ్, మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, మండల పార్టీ అధ్యక్షులు మాచర్ల గణేష్, వైద్యాధికారిణి శ్రీవాణి, మార్కెట్ డైరెక్టర్ లు రంగు హరీష్, రాజ్ కుమార్, సరిత, ఆర్ ఐ అర్జున్, ఎంఆర్సి సిబ్బంది గిరి, యూత్ నాయకులు రంగు రమేష్, ప్రసాద్ బాబు, మల్లేష్, అశోక్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement