Thursday, March 28, 2024

గ్యాస్ ధరలు పెంచిన మోదీ స‌ర్కార్‌.. భగ్గుమన్న ఓరుగల్లు

  • ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో, ధర్నా
  • పెద్దఎత్తున తరలివచ్చిన మ‌హిళ‌లు
  • కట్టెల పొయ్యిపై వంట చేసి, సిలిండర్లతో నిరసన

మోడీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంపునకు నిరసనగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని రోడ్డుపైన వంట చేసి కాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సామాన్యుల నడ్డివిరిచే విధంగా కేంద్రలోని మోడీ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, తాజాగా మరోసారి గ్యాస్ ధరలు పెంచి పేదలపై భారం మోపిన మోడీ ప్రభుత్వం గద్దె దిగే రోజులు దగ్గరపడ్డాయన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు మోడీ సర్కారు ఇచ్చే కానుక ఇదేనా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గ్యాస్ బండను సమాన్యులపై గుదిబండగా మార్చారని ఇప్పటికే పెంచిన నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, మరోమారు సిలిండర్ ధర పెంచి ప్రజల పై అధిక భారం మోపుతున్నారన్నారు. మోడీ సర్కారు ప్రజాగ్రహానికి బలికాక తప్పదని ఎమ్మెల్యే హెచ్చరించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజలను ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రణాళికలతో ముందుకుపోతుంటే గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెంచి అధికభారం మోపి ప్రజలను గోస పెడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన గ్యాస్ ధరలు తగ్గించి మహిళాలోకానికి, ప్రజలకు మోడీ సర్కారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మహిళా నాయకురాళ్లు, టెంపుల్ డైరెక్టర్లు, డివిజన్ల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement