Wednesday, April 24, 2024

లారీ, బైక్ ఢీ .. భార్యాభర్తలు మృతి

వాజేడు : మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని సుందరయ్య కాలనీ దూలాపురం గ్రామాల మధ్య 163 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ బైక్ ను ఢీకొట్టడంతో భార్యభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వాజేడు మండల పరిధిలోని గేర్రగూడెం గ్రామానికి చెందిన తోటపల్లి రమేష్ (39) తోటపల్లి స్వరూప (35) అనే ఇద్దరు దంపతులు ద్విచక్ర వాహనంపై పాయబాట్ల గ్రామానికి ప్రార్థన నిమిత్తం చర్చికి వెళ్తున్నారు. ఈ సమయంలో జగన్నాధపురం గ్రామం నుండి చింతూరు వెళుతున్న లారీ సుందరయ్య కాలనీ గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఇది గ్రహించిన లారీ డ్రైవర్ సంఘటన స్థలం నుండి పరారయ్యారు.

ఈ సంఘటన తెలుసుకున్న వాజేడు ఎస్సై కొప్పుల తిరుపతిరావు అక్కడికి చేరుకొని ప్రమాద వివరాలను సేకరించి మృతిచెందిన దంపతుల ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఓకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలిద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతిచెందిన భార్యాభర్తలకు ఇద్దరు కుమారులున్నట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనతో వాజేడు మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement