Tuesday, April 16, 2024

ప్రజల కష్టాలు తెలిసిన వ్య‌క్తి సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ కవిత

ప్రభ న్యూస్ ప్రతినిధి, ములుగు : ప్రజల కష్టాలు తెలిసిన నేత సీఎం కేసీఆర్ అని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ములుగు జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యూనేస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం సందర్శించారు. రామప్ప దేవాలయాన్ని సందర్శించడానికి విచ్చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో, ప్రజా ప్రతినిధులతో కలిసి ఘణ స్వాగతం పలికిన ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు పుష్ప గుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. గట్టమ్మ దేవాలయం వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ తో కలిసి గట్టమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ములుగు జిల్లా అనేది ఎవరి ఆలోచనలో కూడా లేదని, కానీ ములుగు జిల్లా ప్రజల కష్టాలు తెలిసిన మనిషి కాబట్టి సీఎం కేసీఆర్ ములుగు జిల్లాను ఏర్పాటు చేశారని అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ కోసం 334 ఎకరాల భూ కేటాయింపు, సమీకృత కలెక్టరేట్ కోసం 50 ఎకరాల స్థలం భూమి కూడా కేటాయించారని అన్నారు. ములుగు జిల్లాకు మెడికల్ కాలేజ్ కూడా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. 1800 కోట్ల రూపాయలతో సమ్మక్క బ్యారేజ్ నిర్మాణం, గోదావరి పరివాహక కోత ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణానికి 130 కోట్ల నిధుల కేటాయింపు, ములుగు జిల్లా ప్రజల ఆరోగ్యం కోసం హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు తదితర కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచి యూనేస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర జరిగే మేడారం రెండూ కూడా ములుగు జిల్లాలో ఉండడం ములుగు జిల్లా వాసులు గర్వపడాల్సిన విషయం అన్నారు. కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు జాతీయ పండగ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement