Friday, April 19, 2024

విద్యాసంస్థల్లో చర్యలు సక్రమంగా అమలవుతాయా?

తెలంగాణలో విద్యాసంస్థల్ని తెరిచి ప్రత్యక్ష తరగతుల్ని నిర్వహించే విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా వెలువడిన హైకోర్టు వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా సానుకూల దృష్టితో ఆలోచించాలని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కోవిడ్ తీవ్రత ఇంకా ఉందంటూ సెప్టెంబరు, అక్టోబరులో 3వ దశ పొంచి ఉందన్న హెచ్చరికలను న్యాయమూర్తులు గుర్తు చేశారని ఆమె తెలిపారు. గురుకులాలు, హాస్టళ్ళలో ప్రత్యక్ష బోధన వద్దని, హాస్టళ్ళను తెరవొద్దని, అక్కడి వసతులపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించిందని విజయశాంతి పేర్కొన్నారు. 

ఉస్మానియా మాజీ డీన్ అధ్యయనంలో బయటపడిన ఈ అంశాలపై తెలంగాణ సర్కారు ఇప్పటికీ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదని విమర్శించారు. ఈ పరిస్థితుల మధ్య  విద్యాసంస్థల్లో శానిటైజేషన్, భౌతికదూరం, మాస్కుల ధారణ వంటి అతి ముఖ్యమైన చర్యలు సక్రమంగా అమలవుతాయా?… అనే ఆందోళన విద్యావేత్తలు, వైద్యులు, తల్లిదండ్రుల్లో నెలకొందన్నారు. ఇవన్నీ వీలైనంత త్వరలో పూర్తిగా సరిదిద్దాకే విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించే విషయమై ఆలోచన చేయాలని సూచించారు. వసతులపై నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశంలోని ఔచిత్యాన్ని పాలకులు ఇకనైనా అర్థం చేసుకుని ముందుకెళ్లాలని హితవు పలికారు. భావితరానికి చక్కని భవిష్యత్తు ఇవ్వాల్సిన సర్కారే ఆలోచనారాహిత్యంగా వ్యవహరించడం దురదృష్టకరం అని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ వసతుల విషయంలో గతంలోనే తాను స్పందించానని, చాలా చోట్ల ఫర్నిచర్ పాడవడం, గోడలు-పైకప్పులు నానిపోవడం, తాగునీరు-మరుగుదొడ్ల సౌకర్యాలు లేకపోవడం, కొన్ని బడుల్లో కరెంట్ బిల్లులు కట్టకపోవడం వల్ల విద్యుత్ నిలిపివేత తదితర సమస్యల్ని ప్రస్తావించానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement