Tuesday, April 23, 2024

భయపెట్టాలని చూస్తే… వెన్నుచూపే ప్రసక్తే లేదు

బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ వాహ‌నంపై దాడి ఘ‌ట‌న‌పై ఆపార్టీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతుండడం చూసి ఓర్వలేని టీఆర్ఎస్ సర్కార్… రాజకీయంగా ఎదిరించలేక గూండా రాజకీయాలకు తెరతీస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు తెగబడటం సిగ్గుచేటు అని అన్నారు. నిన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జిల్లాలోని గ్రామాలలో ఎంపీ ఫండ్స్‌తో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వెళ్తే టీఆర్ఎస్ గూండాలు దారిలో అడ్డుకుని, ఆయన కాన్వాయ్ పై రాళ్లు రువ్వి, అడ్డుగా ఉన్న బీజేపీ కార్యకర్తలను కత్తులతో బెదిరిస్తూ కర్రలతో దాడి చేయడం చేస్తుంటే… రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అనే సందేహం కలుగుతోంద‌న్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడికి రక్షణ కల్పించలేని పోలీసులు రాష్ట్రంలో ఉంటే ఎంత… లేకుంటే ఎంత? అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో నానాటికీ టీఆర్ఎస్ గూండాలు అరాచకాలు సృష్టిస్తుంటే పోలీసు ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేద‌ని మండిప‌డ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. దాడులతో బీజేపీ నాయకులను, కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే… వెన్నుచూపే ప్రసక్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు. అత్యంత ధైర్యవంతులు, సాహసవంతులైన త‌మ‌ పార్టీ కార్యకర్తలకు ఉద్యమాల్లో ప్రాణాలకు తెగించిన పోరాడిన చరిత్ర ఉంద‌ని గుర్తు చేశారు. మీ కుట్రలను కసిగా తిప్పికొడుతూ మీ ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై తిరగబడటం ఖాయం అని విజ‌య‌శాంతి హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement