Friday, March 29, 2024

రాహుల్ గాంధీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం – ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి – రాహుల్ గాంధీ నాయకత్వంలో 2024 లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని నల్గొండ పార్లమెంట్ సభ్యుడు నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం భువనగిరి పట్టణ కేంద్రంలో సీఎల్పీ నేత చేపట్టిన పీపుల్స్ మార్చ్ 49వ రోజులో భాగంగా ఏర్పటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు.2023 డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.బీబీనగర్ లో ఎయిమ్స్ పూర్తి చేయాలని పార్లమెంటు సాక్షిగా గత నాలుగు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నానని ,బీబీనగర్ ఏయిమ్స్ కు రూ.1000 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నాలుగేళ్ల కిందట ప్రకటన చేసిందే తప్ప నిధులు విడుదల చేయలేదన్నారు.

ఎన్ని నిధులు ఖర్చు చేశారని కేంద్రాన్ని నిలదీయగా ఇప్పటివరకు కేవలం రూ. 28 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టామని లిఖితపూర్వకంగా పార్లమెంటులో నిసిగ్గుగా సమాధానం చెప్పిందన్నారు.నత్త నడకన ఎయిమ్స్ పనులు సాగుతున్నప్పటికీ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయలేదని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పనులు చేయడం లేదని చెప్పారు. ఎయిమ్స్ ఎప్పుడు పూర్తి చేస్తొరని పార్లమెంట్లు లో అడిగిన ప్రతి సందర్భంలో వచ్చే సంవత్సరం పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుందే తప్ప పూర్తి చేయడం లేదన్నారు. ఎయిమ్స్ పూర్తి చేయని బిజెపికి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.లక్షల కోట్లు ఖర్చుపెట్టి ఒక ఎకరానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాగునీరు ఇవ్వలేదని చెప్పారు. రూ.42 వేల కోట్ల తో చేపట్టిన మిషన్ భగీరథ పనులు కమిషన్ల కక్కుర్తి కోసమేనని, తెలంగాణలో ఏ ఇంటికెళ్లిన మిషన్ భగీరథ ద్వారా ప్యూరిఫైడ్ నీరు రావడం లేదని ప్రజలు చెబుతున్నారన్నారు.

మంచినీళ్ల కోసం అనేక గ్రామాల్లో ప్రజలు రోడ్డు ఎక్కుతున్నారని తెలిపారు.విప్లవాల జిల్లా పోరాటాలకు చారిత్రాత్మక నేపథ్యం కలిగిన భువనగిరికి చేరుకునే నాటికిభట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 600 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం చాలా చారిత్రాత్మకమన్నారు.స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ తరహాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారని, ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు.రాష్ట్రంలోని నిరుద్యోగులకు భరోసా ఇవ్వడానికి ఈ నెల 8న హైదరాబాద్ సరూర్ నగర్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరవుతున్నారని,ఈ బహిరంగ సభకు నిరుద్యోగులు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు

ఈ సంధర్బంగా యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కేక్ కట్ చేసి భట్టి విక్రమార్క కి కేక్ తినిపించి అభినందన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు పొత్నక్ ప్రమోద్ కుమార్, తంగళ్లపల్లి రవి కుమార్, జహంగీర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement