Thursday, March 28, 2024

Telangana | ఉగాది అందరి జీవితాల్లో ఆనందం నింపాలి.. సింగరేణి భవన్‌లో ఘ‌నంగా వేడుక‌లు

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ప్రతీ ఒక్కరి జీవితంలో ఆనందాలు నింపాలని, ప్రతీ ఒక్కరూ తమ వ్యక్తిగత జీవితాల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను, కంపెనీ నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాధించేలా చూడాలని జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) ఎం.సురేశ్ ఆకాంక్షించారు. బుధవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో నిర్వహించిన ఉగాది సంబురాల్లో ముఖ్య అతిథిగా మాట్లాడారు. సంస్థ ఛైర్మన్, ఎండీ శ్రీధర్ మార్గనిర్దేశంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో అత్యధికంగా 67 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే రానున్న ఏడాది సంస్థ నిర్దేశించుకున్న 75 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాల సాధనకు అందరూ కృషి చేయాలన్నారు.

కార్యక్రమంలో బొగ్గు గని అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ఎన్.వి.రాజశేఖరరావు మాట్లాడుతూ.. సంస్థ ఛైర్మన్, ఎండీ తీసుకున్న బహుముఖ వ్యాపార విస్తరణ చర్యలతో సింగరేణికి బలమైన ఆర్థిక పునాదులు ఏర్పడ్డాయన్నారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీధర్ ఉగాది సందేశం ప్రతులను ఉద్యోగులకు పంపిణీ చేశారు. కవి శ్రీ జయరాజ్ ప్రకృతిపై ఆలపించిన గీతం అందరినీ ఆకట్టుకుంది. ఉద్యోగులందరికీ ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్, అన్ని విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు, పొరుగు సేవల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement