Saturday, April 20, 2024

స‌త్వ‌ర చ‌ర్య‌ల‌తో స‌ర్కార్ స‌ఫ‌లం…

హైదరాబాద్, :ప్రభుత్వం జారీ చేస్తున్న ముందస్తు జాగ్రత్తలు, హెచ్చరికలు ఇప్పుడు పక్కాగా ప్రజలకు చేరుతున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణను తెలంగాణప్రభుత్వం లాక్‌డౌన్‌ లేకుండానేర్పుగా ప్రజల్లో ,చైతన్యం తెచ్చి పాలనకు, రాష్ట్ర రాబడికి ఢోకా లేకుండా చూస్తోంది. సర్కార్‌ తనదైన పంథాలో అన్ని శాఖలను, వనరులను, చివరకు గ్రామ పోలీస్‌ సేవలను కూడా ప్రణాళికా బద్దంగా వినియోగించుకుంటోంది. కలెక్టర్లు, ఎస్పీలు ఇప్పుడు ప్రజలను కరోనాపై కట్టడి చేయడంలో సఫలమవుతూ ప్రభుత్వ సమా చారాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. జిల్లాల పాలన కొత్త పంథాలో మొదలైన తర్వాత ఇంతటి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జాయింట్‌ కలెక్టర్ల రద్దు, డీఆర్వోల తొలగింపుతోపాటు ఒక్కో జిల్లాకు ఇద్దరేసి అదనపు కలెక్టర్లను నియమించడం తాజా కరోనా పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేందుకు అద్భుతంగా కలిసివస్తోంది. కలెక్టర్లకు ప్రభుత్వం నియంత్రణా చర్యలను ఆదేశించిన వెంటనే రాష్ట్రంలోని మారుమూల తండాలు, గిరిజన ఆవాసాల్లోనూ అమలు చేసేలా యంత్రాంగం చురుగ్గా కదులుతోంది. రాష్ట్రంలో కరోనా విస్తృతిని అంచనా వేసిన ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. అంతే వేగంగా వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేస్తూనే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైన ప్రభుత్వం కఠిన నియంత్రణలను అమలులోకి తేవాలని ఆదేశించింది. ఈ దిశలో ఉన్న అన్ని రకాల సాంకేతికతలను, వనరులను తెలంగాణ సర్కార్‌ సమర్ధవంతంగా వినియోగించుకుంది. ఆదేశాలు జారీ చేయడం, భిన్నమైన శాఖలను సమన్వయం చేస్తూ ప్రజారోగ్యానికి కృషి చేసింది. ఇందుకు మొబైల్‌ఫోన్లు, ట్యాబులు, వీడియో కాన్ఫరెన్సింగ్‌ సౌకర్యాలను పూర్తిగా వినియోగించుకుంది. వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్‌ స్వయంగా చేతుల్లోకి తీసుకోవడంతో సీఎస్‌ సోమేష్‌కుమార్‌ రోజుకు రెండు సార్లు సమీక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా పర్యవేక్షిస్తూ పర్యటిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ కరోనానుంచి కోలుకోవడంతో వరుసగా సమీక్షలు చేస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా ఆక్సిజన్‌ కొరత లేకుండా, వ్యాక్సినేషన్‌కు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్నది.
తెలంగాణలో ఆర్ధికవృద్ధి వేగవంతం, మౌలిక వసతుల కల్పనను మరింత మెర్గు పర్చడం, సామాజిక సంక్షేమ పథకాల అమలులో సంఘటిత వృద్ధి లక్ష్యాలుగా తెలంగాణ రాష్ట్ర జిల్లా పర్యవేక్షణ విధానం అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం గతంలో ప్రణాళికలను సిద్దం చేసింది. ప్రభుత్వ విధానాలను మరింత ముందుచూపుతో, ఆటంకాలు లేకుండా అమలు చేసేలా శాఖలవారీగా ప్రమాణాలను పాయింట్ల వారీగా నిర్ధేశించింది. ప్రభుత్వమిచ్చిన ఆదేశాలు, అత్యవసర పిలుపుల అమలులో అన్ని శాఖలు సక్రమంగా పాలుపంచుకుని, చిత్తశుద్ధితో లక్ష్యం చేరేలా ఒక్కో శాఖకు ఒక్కో గీటురాయిని నిర్ణయించింది. లబ్దిదారులకు సంక్షేమ పథకాల ఫలాలు అందజేతలో అన్ని శాఖలు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేలా ఈ పాయింట్లను వర్తింపజేసింది. దీనినే స్థూలంగా తెలంగాణ జిల్లా పర్యవేక్షణ విధానం(టీఎస్‌డిఎంఎస్‌) గానామకరణం చేసింది. ప్రభుత్వ పథకాలన్నింటినీ క్రమపద్ధతిలో అమలయ్యేలాపర్యవేక్షించేందుకు అన్ని శాఖలకు సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తారు. వాటిద్వారా ఆయా శాఖల పనితీరును, ప్రజలకు పథకాల ఫలాలు చేరవేస్తున్న తీరును గుర్తిస్తారు. వీటన్నింటినీ ఏకీకృతం చేసి కలెక్టర్ల పర్యవేక్షణలో ఉంచేలా చర్యలు తీసుకుంది. ఇప్పుడీ విధానంతో కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తీసుకున్న అన్ని చర్యలు ఫలప్రదమవుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు, గిరిజన గూడాలు, మారుమూల ఆదివాసీ ప్రాంతాల్లో కూడా సమర్ధవంతంగా కరోనాపై ప్రచారం, జాగ్రత్తలతో ప్రజలను అలర్ట్‌ చేయగలిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement