Friday, April 19, 2024

గ‌వర్న‌ర్ పై హైకోర్టులో ప్ర‌భుత్వం లంచ్ మోష‌న్ పిటిష‌న్

హైద‌రాబాద్ – గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై, తెలంగాణ ప్ర‌భుత్వం మ‌ధ్య వార్ పీక్ చేరింది.. ఏ ఒక్క‌రూ వెన‌క్కి త‌గ్గ‌డం లేదు..అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల‌ను తొక్కి పెట్టిన గ‌వ‌ర్న‌ర్ తాజాగా బ‌డ్జెట్ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వకుండా నిలిపివేశారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు అనుమతి కోసం ఈనెల 21న ప్రభుత్వం లేఖ రాస్తే.. గవర్నర్‌ స్పీచ్‌ ఉందోలేదో చెప్పాలంటూ తిరుగు ట‌పాలో గ‌వ‌ర్న‌ర్ నుంచి లేఖ ప్ర‌భుత్వానికి చేరింది. దీంతో అంతంతమాత్రమున్న సంబంధాలు కూడా ఇప్పుడు పూర్తిగా తెగిపోయాయ్‌. ఎవరూ పూడ్చలేనంతగా అగాధం ఏర్పడింది. పైచేయి కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తోన్న ఇరువర్గాలు ఇప్పుడు మరోసారి తమ అస్త్రాలను బయటికి తీశారు. గ‌వ‌ర్న‌ర్ తమిళిసై నుంచి ఇప్పటి వరకు అనుమతి రాకపోవడంతో నేడు లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇందుకోసం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేను ప్రభుత్వం రంగంలోకి దించింది. బడ్జెట్‌కు గవర్నర్ తక్షణం ఆమోదం తెలిపేలా ఆదేశాలివ్వాలని ప్రభుత్వం తన పిటిషన్‌లో కోరనుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 202 ప్రకారం బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి.
ఇతర విషయాల్లో సరే కానీ, బడ్జెట్ ఆమోదం విషయంలో గవర్నర్ విచక్షణకు తావుండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్‌కు ఆమోదం విషయమై ఈ నెల 21నే రాష్ట్రప్రభుత్వం గవర్నర్‌కు లేఖ పంపింది. అయినప్పటికీ ఆమోదం తెలపకపోవడంతో కోర్టును ఆశ్రయించడానికే ప్రభుత్వం మొగ్గు చూపింది. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో గవర్నర్ ప్రసంగం ఉండడం అనేది అత్యవసరం కాదని కూడా చెబుతున్నారు. గతేడాది కూడా గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే, కోర్టులు గవర్నర్‌ను ఆదేశించలేవన్న విషయం గతంలో పలు సందర్భాల్లో స్పష్టమైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించనుండడంపై ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement