Thursday, April 25, 2024

నీటి విడుదలపై త్రిసభ్యకమిటీ భేటీ.. జలసౌధలో డిసెంబర్ 6న సమావేశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: యాసంగి పంటలకు నీటివిడుదల పై కృష్ణా నదీ యాజమాన్యం బోర్డుతో ఆంధ్ర,తెలంగాణ ఈఎన్సీలు సమావేశం కానున్నారు. ఈ త్రి సభ్యకమిటీ 6 డిసెంబర్‌ న జలసౌధలో ఈ సమావేశం జరగనుంది. తెలంగాణ ఇంజనీరంగ్‌ ఇన్‌ చీఫ్‌ సి. మురళీధర్‌, ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి తో కెఆర్‌ఎంబీ సమావేశం కానుంది. తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదల పై ఈ సమావేశం లో నిర్ణయం తీసుకోనున్నారు. జలవిద్యుత్‌, రూల్‌ కర్స్య్‌, వరద జలాల అంశాలపై చర్చించనున్నారు. 2022-2023 సాగు, తాగునీరు అవసరాలకు నీటి విడుదల పై కూడా ఈ సమావేశంలో కృష్ణాబోర్డు సభ్యకార్యదర్శి రెండు రాష్ట్రాల ఈ ఎన్సీలతో భేటీ అయి నీటి విడుదల ఉత్తర్వులు జారీచేయనున్నారు.

అవసరాలకు సరిపోయే విధంగా కేటాయింపులు ఉండాలి..

ప్రస్తుత యాసంగి సీజన్‌ తోపాటుగా రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి అవసరాలకోసం నీటి వాటాల పెంపుకు ఇరురాష్ట్రాలు పట్టుబట్టనున్నాయి. అయితే నీటి లభ్యత, అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి విడుదల అంశంపై కెఆర్‌ఎంబీ ఉత్తర్వులు జారీచేయనుంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉంది. కృష్ణా ,నాగార్జున సార్‌ లో నీటి మట్టాలు పుష్కలంగా ఉండటంతో పాటుగా వరదజలాలు కూడా వచ్చిచేరుతుండటంతో నీటివాటాలకోసం పట్టుబట్టనున్నారు. అయితే ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యులేటర్‌ కు నీటిని తరలిస్తుండటంతో నీటి కేటాయింపుల్లో తమకు అనుకూలంగా కేటాయింపులు ఉండాలని ఈ సమావేశంలో తెలంగాణ పట్టుబట్టనుంది.

అలాగే శ్రీశైలం జలవిద్యుత్‌ కు ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు ఉండాలని తెలంగాణ పట్టుబట్ట నుంది. తెలంగాణలో కృష్ణానదీ జలాలను నింపుకోవడానికి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, నికరజలాల కేటాయింపులో అన్యాయం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం నీటి సంవత్సరానికి తెలంగాణకు నీటి కేటాయింపులు అవసరాలకు సరిపోయే విధంగా ఉండాలని ఈ సమావేశంలో తెలంగాణ వాదనలు వినిపించేందుకు సిద్దం అవుతుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్‌ నీటి సామర్ధ్యం 312.05 ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 308.47 టీఎంససీలు ఉంది. అలాగే ఇన్‌ ఫ్లో 394606 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ ఫ్లో కూడా ఇన్‌ ఫ్లోకు సమానంగా ఉంది. అలాగే శ్రీశైలంలో నీటి సామర్ధ్యం 215.81 టీఎంసీలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 211. 48 టీఎంసీలు ఉంది. అలాగే ఇన్‌ ఫ్లో 401187 ఉండగా ఔట్‌ ఫ్లో 445745 క్యూసెక్కులు ఉంది.

- Advertisement -

ఈ రెండు ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిలువలు ఆశాజనకంగా ఉండటంతో యాసంగీ పంటలకు, తాగునీటికి సమస్యలు ఉత్పన్నం కాకుండా నీటి కేటాయింపులు ఉంటాయనే ఆశాభావం వ్యక్తమవుతుంది. నీటి కేటాయింపులతో పాటుగా ప్రాజెక్టులనీటి మట్టాల నిర్వహణ సమర్ధవంతంగా నిర్వహించాలి, రూల్‌ కర్వ్‌ నిర్వహించాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తున్నప్పటికీ కెఆర్‌ఎంబీ ఆమేరకు నిర్ణయాలు తీసుకోకపోవడంతో నాగార్జునసాగర్‌, శ్రీశైలం నుంచి నీటి విడుదలకు శాస్త్రీయత ఉండటం లేదని తెలంగాణ వాపోతుంది. ప్రస్తుతం జరగనున్న త్రిసభ్య సమావేశంలో రూల్‌ కర్వ్‌ పై పట్టుబట్టనున్నట్లు ఇంజనీర్లు చెప్పారు. అలాగే పోతిరెడ్డి పాడునీటి వివాదం కూడా చర్చకువచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement