Thursday, April 18, 2024

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో మొట్ట‌మొద‌టి మేఘా సీఎన్‌జీ బంక్​ ప్రారంభం.. హైవేపై వాహనదారులకు అందుబాటులో గ్యాస్​..

జ‌డ్చ‌ర్ల (మహబూబ్ నగర్) : మేఘా ఇంజనీరింగ్ అండ్​ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ (MCGDPL) సీఎన్‌జీ సేవ‌ల విస్త‌ర‌ణ‌లో మ‌రో మైలురాయిని అధిగ‌మించింది. జ‌డ్చ‌ర్ల శివారులో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే మొట్ట‌మొద‌టి CNG స్టేషన్​ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎ.వెంకటేశ్వర రెడ్డి చేతుల మీదుగా శ‌నివారం ప్రారంభ‌మైంది. బెంగళూరు -హైదరాబాద్ జాతీయ‌ రహదారి (NH-44)పై జడ్చర్ల టౌన్ శివార్లలో ”హైవే 79 గ్యాస్ స్టేషన్‌”లో ఇక‌పై సీఎన్‌జీ అందుబాటులోకి రానుంది. CNGతో న‌డిచే కార్లు, ఆటోలు, బస్సులు, ట్రక్కుల కోసం చ‌వ‌కైన‌, పర్యావరణ అనుకూలమైన CNG ఫ్యూయ‌ల్ ఇక్క‌డ‌ 24 గంట‌లు అందుబాటులో ఉంటుందని మేఘా ప్రతినిధులు తెలిపారు.

దేశంలోని 62 జిల్లాల్లోని 22 భౌగోళిక ప్రాంతాలలో- 10 రాష్ట్రాలను కవర్ చేస్తూ MCGDPL త‌న CGD ప్రాజెక్టుల‌ను వినియోగంలోకి తెచ్చింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మేఘా గ్యాస్ త‌న సేవ‌ల‌ను విస్త‌రిస్తోంది. పలు రాష్ట్రాల ప‌రిధిలోని వివిధ ప్రాంతాల్లో ఇప్ప‌టికే 2,300 కిలోమీటర్ల మేర MDPE లైన్‌, 600 కిలోమీటర్ల స్టీల్‌ పైప్‌లైన్‌లను ఏర్పాటు చేసింది. జ‌డ్చ‌ర్ల‌లో ప్రారంభించిన స్టేష‌న్‌తో ఈ CNG స్టేషన్ల సంఖ్య 60కి చేరింది. గృహ అవ‌స‌రాల‌కు ఉప‌యోగించే గ్యాస్ స‌ర‌ఫ‌రాతో సైతం మేఘా గ్యాస్ విస్త‌రిస్తూ వ‌స్తోంది. ఇప్ప‌టికే 80 వేల ఇళ్ల‌కు గ్యాస్ స‌ర‌ఫ‌రా సేవ‌ల‌ను మేఘా గ్యాస్ అందిస్తున్నట్టు సమాచారం.

కార్యక్రమంలో మేఘాగ్యాస్ సీఈవో వెంకటేష్ పాలింపాటి మాట్లాడుతూ.. మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ 60వ సిఎన్‌జి స్టేషన్‌ను జడ్చర్ల ”హైవే 79 గ్యాస్ స్టేషన్‌” లోప్రారంభించడం గర్వంగా ఉంద‌న్నారు. . MCGDPL ద‌క్కించుకున్న‌ 22 ప్రాంతాలలో CGD నెట్‌వర్క్‌ను విస్త‌రించ‌డానికి ప‌దివేల‌ కోట్లకు పైగా పెట్టుబడులు పెడ‌తామ‌న్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 100కి పైగా కొత్త CNG స్టేషన్లను నెలకొల్పాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్ల‌డించారు.

- Advertisement -

పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) ఇటీవల నిర్వహించిన 11వ CGD బిడ్డింగ్ రౌండ్‌లో మేఘా గ్యాస్ కంపెనీ 15 భౌగోళిక ప్రాంతాలలో గ్యాస్ స‌ర‌ఫ‌రా కాంట్రాక్టు ద‌క్కించుకుంది. ఈ 15లో మొదట సీఎన్‌జీ స‌ర‌ఫ‌రాకు సిద్ధ‌మైన‌ భౌగోళిక ప్రాంతం మహబూబ్‌నగర్ కావ‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement