Tuesday, April 23, 2024

గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెంచి పేద‌ల న‌డ్డివిరుస్తున్న కేంద్రం .. శ్రీనివాస్ గౌడ్

త‌ర‌చూ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను పెంచుతూ కేంద్రం ప‌ద‌ల న‌డ్డివిరిచేలా చేస్తుంద‌ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ అధ్వర్యంలో సిలిండర్ ధరల పెంపును నిరసిస్తూ ఖాళీ సిలిండర్లతో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తరచుగా సిలిండర్ ధరలు పెంచుతూ పేద ప్రజల నడ్డి విరిచే విధంగా వ్యవహరిస్తుందని ఆవేదన చెందారు.

అంతేకాక పెట్రోల్, డీజిల్, నిత్య అవసరాల ధరల పెంపుతో సామాన్యుల‌ జీవితం ప్రశ్నార్థకంగా మారిందని మండిపడ్డారు. మోడీ పాలనలో బలిసినొడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడని, పేదవాడు ఇంకా పేదవాడిగా మిగిలిపోతున్నాడని విమర్శంచారు. ప్రధాని మోడీ ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు అప్పజెబుతున్నాడని, దీంతో ఆదాని ఆస్తులు పెరిగిపోతున్నాయన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాటికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి గ్యాస్ ధరలు తగ్గించకపోతే లక్షల మంది మహిళలను సేకరించి ఢిల్లీలో నిరసన తెలుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, ముడా ఛైర్మెన్ వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement