Saturday, April 20, 2024

ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్ కన్నుమూత

ప్రముఖ కవి, దళిత సాహితీ రథసారథి, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. ఆయన సాహిత్యానికి చేసిన సేవ ఎనలేనిది. ఆయన మృతితో తెలుగు సాహిత్య లోకం దిగ్భ్రాంతికి గురైంది. రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో, తెలుగు ఆచార్యునిగా సేవలందించి ఎందరో విద్యార్థులకు, పరిశోధకులకు, మార్గదర్శనం చేశారు.

21 జనవరి 1959 సం.లో నిజామాబాద్ జిల్లా పాముల బస్తీలో ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయి దంపతులకు సుధాకరరావు జన్మించారు. వీధి బడి చదువు నుంచి విశ్వవిద్యాలయ చదువు వరకు హైదరాబాద్లోనే పూర్తిచేసుకుని తెలుగు ఉపాధ్యాయునిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి విశ్వవిద్యాలయ ఆచార్యునిగా ఎదిగారు. ప్రవృత్తిగా తెలుగు కవితా దిగ్గజంగా సాహితీలోకంలో విశేషమైన కృషి చేసి, తెలుగు దళిత కవిత్వంలో తనదైన ముద్రతో పయనించారు. వర్తమానం, కొత్త గబ్బిలం, నా అక్షరమే నా ఆయుధం, మల్లెమొగ్గల గొడుగు, నల్లద్రాక్ష పందిరి, వర్గీకరణీయం, గోసంగి, కథానాయకుడు జాషువా, తెలి వెన్నెల, మొదలైన రచనలతో తెలుగు సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేశారు.

వీరి కుటుంబం కూడా తెలుగు సాహిత్యంతో పెనవేయబడింది. సుధాకర్ రావు భార్య దివంగత హేమలత, రచయిత్రి సామాజిక సేవకురాలు కాగా, కుమార్తె ఎండ్లూరి మానస చక్కటి కథా రచయిత్రి. తాను రాసిన కథా సంపుటి “మిళిoద” కు 2020 సంవత్సరంలో కేంద్ర సాహిత్య యువపురస్కారం లభించింది. హేమలత 2019లో మరణించిన నాటి నుండి సుధాకర్ తీవ్ర మానసిక వేదనకు లోనయ్యారు. ఒకానొక సందర్భంలో ” నాకూ కరోనా వచ్చి హేమ చెంతకు చేరిస్తే బాగుండును” అంటూ తన నిర్వేదన భావాన్ని వ్యక్తపరిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement