Wednesday, April 17, 2024

ఉద్యోగులకు తీపి కబురు..!


తెలంగాణ సర్కార్ ఉద్యోగులకు తీపి కబురు.. పీఆర్సీపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సుమారు రెండు సంవత్సరాలుగా ఉద్యోగులను ఊరిస్తున్న వేతన సవరణ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం కీలక ప్రకటన చేయబోతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. వేతన సవరణతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న ఈహెచ్ఎస్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తదితర అంశాలపైనా తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన ఆనందంలో సీఎం కేసీఆర్.. ఉద్యోగులపై వరాలు కురిపిస్తారన్న ప్రచారం సాగుతోంది.

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు వేతనాల పెంపు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఎప్పుడు ప్రకటిస్తారా? ఎంత ఇస్తారా? అని వేయి కళ్లతో చూస్తున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ప్రగతి భవన్లో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమై పీఆర్సీపై చర్చించారు. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన మధ్యంతర భృతి కన్నా కనీసం రెండు శాతం ఎక్కువే ఫిట్మెంట్ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. దీంతో కనీసం 29 నుంచి 33 శాతం ఫిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం తాజాగా వ్యక్తం అవుతోంది. ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై సైతం కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇప్పుడా హామీని నిలబెట్టుకుంటారని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆర్థిక శాఖకు చేసిన కేటాయింపుల్లో రూ. 8 వేల కోట్లను ప్రత్యేకంగా చూపారు. అయితే ఈ నిధులను పీఆర్సీ కోసమే ప్రత్యేకంగా చూపారన్న చర్చ జోరుగా సాగుతోంది.

కాగా, పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో.. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటర్లను ప్రభావితం చేసే ప్రకటనలు ఏవీ చేయకూడదు. ఈ క్రమంలోనే పీఆర్సీ ప్రకటనపై రాష్ట్ర ఆర్థికశాఖ ఎన్నికల సంఘం అనుమతి కోరింది. దీనిపై స్పందించిన ఈసీ.. పీఆర్సీ ప్రకటనకు ఎలాంటి ఇబ్బందీ లేదని తెలిపింది. ఈసీ నుంచి లైన్ క్లియర్ కావడంతో.. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ ప్రకటించేందుకు మార్గం సుగమమైంది.

https://www.prabhanews.com/tsnews/hyderabadnews/prc-to-be-announced-tomorrow/

Advertisement

తాజా వార్తలు

Advertisement