Friday, April 19, 2024

ఆర్టీఏ అధికారుల వ్యూహం.. అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న ఇసుక లారీలు, బ‌స్సుల‌పై ఫైన్‌, కేసు న‌మోదు

ఉప రవాణా కమిషనర్ డాక్టర్ పాపారావు ఎల్లప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ, విలక్షణంగా విధులు నిర్వహిస్తుంటారు. అందరికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు. ఆకస్మికంగా విజిలెన్స్ టీం లను ఏర్పాటు చేసి.. తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా పన్నులు కట్టక తిరుగుతున్న బస్సులపై కొరడా ఝులిపించారు. అలాగే మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఇసుక ఒవర్ లోడ్ తో తిరుగుతున్న లారీలపై కేసులు నమోదు చేసి సీజ్ చేయడం జరిగింది. ముందు తన ప్లాన్ ప్రకారం నిన్న అర్ధ‌రాత్రి రెండు టీం లను నియమించి , ఒక్కో టీం లో ఒక ఆర్టీఓ, నలుగురు ఎం.వి.ఐ లు, నలుగురు ఎఎంవీఐలు, పది మంది కానిస్టేబుళ్లు, హోంగార్డు ఉండేలా ప్లాన్‌చేశారు. మొదట మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల మీదుగా ఇసుక ఒవర్ లోడ్ తో తిరుగుతున్న వాహనాలను తనిఖీ చేయించారు. ఈ త‌నిఖీల్లో రెండు జిల్లాల్లో ఒవర్ లోడ్ తో తిరుగుతున్న దాదాపు 15 లారీలను సీజ్ చేశారు.

దీన్నంతా సహచర ఉప రవాణా కమిషనర్ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ తో క‌లిసి పాపారావు స్వయంగా త‌నిఖీల్లో పాల్గొన్నారు. ఈ కేసుల నమోదు వలన రవాణాశాఖ 10 లక్షలు, మైనింగ్ శాఖకు 8 లక్షల ఆదాయం అపరాధ రుసుం రూపంలో స‌మ‌కూరింది. అలాగే తెల్లవారుజామున విజయవాడ – హైదరాబాద్ హైవేలో ఉన్న చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద ఈ రెండు టీమ్‌ లతో అక్రమంగా తెలంగాణా రాష్ట్రానికి రావలసిన పన్నులు చెల్లించక తిరుగుతున్న బస్సులపై కొరడా ఝులిపించారు. బస్సుల మీద మర్చంటైల్ గూడ్స్ ను రవాణా చేస్తున్న బస్సుల పై కూడా తనిఖీ లలో పాల్గొని కేసులు న‌మోదు చేశారు. టాక్స్ కట్టక తిరుగుతున్న 10బస్సులను సీజ్ చేశారు. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న 5 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల ద్వారా ప్రభుత్వానికి 30లక్షల ఆదాయం రానుంది. ఈ తనిఖీల్లో పాపారావుతో పాటు పుప్పాల శ్రీనివాస్ డిటిసి, ఆర్టీఓ లు సురేష్ రెడ్డి, రాంచందర్, యంవిఐ లు ఉమామహేశ్వరరావు, అల్లె శ్రీనివాస్, డి. శ్రీనివాస్, మహేందర్, రాహుల్, శంకర్నారాయణ, పాల్, సాయి తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement