Wednesday, April 24, 2024

భూక‌బ్జాదారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న శ్రీశైలం గౌడ్

నిరుపేద కుటుంబంపై దాడికి పాల్పడిన భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ డిమాండ్ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజవర్గం గాజులరామారం డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్ 342 సర్వేనెంబర్ లో సోమవారం ఓ పేద కుటుంబంపై ఇన్ ఫార్మర్ నెపంతో తీవ్రంగా కబ్జాదారులు దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్ దాడిలో గాయిపడిన వారిని పరామర్శించారు. ఈరోజు ఉదయం కూన శ్రీశైలం గౌడ్ సంఘటన స్థలానికి వెళ్లి బస్తీవాసులతో మాట్లాడగా… అక్కడ ప్రభుత్వ భూములను టీఆర్ఎస్ నాయకులు, కొంతమంది అక్రమార్కులు కలిసి కబ్జాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆయనకు తెలిపారు.

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ కబ్జాలపై అధికారులతో మాట్లాడారు.. దీనిపై ఎమ్మార్వో వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. చిన్న గుడి కట్టుకొని అక్కడ నివాసముంటున్న స్థానిక నివాసి వాసుపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. దీనిపై జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ సెటిల్ మెంట్ల‌కు అడ్డాగా మారిందని ఆరోపించారు. ప్రస్తుత ఇన్ ఛార్జి ఎమ్మార్వోగా బాధ్యతలో ఉన్న డిప్యూటీ తహ‌సిల్దారు వినయ్ కుమార్ కబ్జాలపై స్పందించడం లేదని ఆరోపించారు. కబ్జాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపినట్లయితే కబ్జాలను అరికట్టవచ్చని కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ సాయి నాధ్ లతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement