Friday, April 19, 2024

వెలుగులోకి శిల్పా చౌద‌రి మోసాలు.. పోలీస్ స్టేష‌న్‌కు క్యూ క‌డుతున్న బాధితులు..

కిట్టీ పార్టీలతో సినీ రంగ ప్రముఖులకు ఎరవేసిన శిల్పా చౌదరి మోసాలు తవ్వినా కొద్ది మరిన్ని వెలుగు చూస్తూనే ఉన్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అధిక వడ్డీలు ఇస్తామని పెద్ద మొత్తంలో వసూలు చేసి జైల్లో ఊచలు లెక్కబెడుతోంది శిల్ప. చాలామంది ప్రముఖుల్ని మోసం చేసిన శిల్ప.. దాదాపు రూ.200 కోట్ల దాకా కుచ్చు టోపీ పెట్టినట్లు చెబుతున్నారు. అయితే, శిల్ప చౌదరి కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. పలువురిని మోసం చేసి దాదాపు రూ.90 కోట్ల వరకు వసూలు చేసింది. ఆ డబ్బులతో గండిపేటలో లగ్జరీ విల్లాను కొనుగోలు చేసింది. కాగా, హీరో కృష్ణ కూతురు, సుధీర్ బాబు భార్య ప్రియ నుంచి శిల్పా చౌదరి 2.90 కోట్లు తీసుకుని మోసం చేసిన‌ట్టు నార్సింగ్ పిఎస్ లో మరో ఫిర్యాదు అందింది. ఇప్పటి వరకు నార్సింగి పీఎస్‌లో నమోదైన ప‌లు కేసుల్లో అరెస్ట్ అయిన శిల్పా చౌదరీ దంపతులు జైల్లో ఉన్నారు.

కాగా, ఇప్పటివరకు నార్సింగిలో నాలుగు, జూబ్లిహీల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ పీఎస్ లో మొత్తం 8 కేసులు నమోదు చేశారు పోలీసులు. పోలీసుల విచారణలో శిల్పా బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక్క నార్సింగి పరిధిలోనే సుమారు రూ.10 కోట్ల మోసానికి పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు.

ట్విన్‌ సిటీలో ఈమె బాధితులు ఉన్నారని.. మొత్తం రూ.70కోట్లకు పైగా మోసం చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సినీ ప్రముఖుల నుంచి ఇండ‌స్ట్రీలియ‌స్టుల‌ వరకు ఎవరినీ వదిలి పెట్టలేదు శిల్పా చౌదరి. హంగూ.. ఆర్భాటం ప్రదర్శిస్తూ పలువురు సెలబ్రెటీలను బుట్టలో వేసుకొని కోట్లలో బురిడీ కొట్టించారూ కిలాడీ దంపతులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement