Thursday, March 28, 2024

ప్రజా సౌకర్యార్థం రహదారి విస్తరణ.. హ‌రీశ్ రావు

నిత్యం ట్రాఫిక్ పెరుగుతున్న దృష్ట్యా ప్రజా సౌకర్యార్థం రహదారి విస్తరణ చేపడుతున్నామ‌ని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. సిద్ధిపేట పట్టణ శివారు ఎల్లమ్మ గుడి నుంచి ఇల్లంతకుంట రోడ్డు విస్తరణ – రూ.66 కోట్ల వ్యయంతో మొదటి విడతగా సిద్ధిపేట నుంచి చిన్నకోడూర్ వరకూ 10కిలో మీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాప‌న చేవారు. మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఏంపీపీ మాణిక్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సిద్ధిపేట ఎల్లమ్మ దేవాలయం నుంచి చిన్నకోడూర్ వరకూ నాలుగు లేన్ల రహదారి, బట్టర్ ఫ్లై లైట్స్ తో అభివృద్ధి చేపడతామ‌న్నారు.

రాబోయే రోజుల్లో రంగనాయక సాగర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామ‌న్నారు. సిద్దిపేట చుట్టూ నలు వైపులా నాలుగు లేన్ల రహదారి పనులు జరుగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం కేసీఆర్ సీఎం అయ్యాక ఇవన్నీ జరుగుతున్నాయని తెలిపారు. రంగనాయక సాగర్ నుండి నీరు వదలాలని రైతుల కోరిక మేరకు నేడు నీరు వదులుతున్నా మ‌న్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కాళేశ్వరం నీళ్లతో ఎకరం భూమి పారలేదని ఆరోపిస్తున్నారని విమర్శించారు. రైతుల పంట పొలాల్లో నీరు పారుతుంటే వారికి కండ్లు ఉండి చూడలేకపోతున్నారని ప్రతిపక్ష పార్టీల తీరుపై విమర్శలు చేశారు. కాళేశ్వరం ఫలితం ఏమిటో మా గ్రామాలకు వచ్చి పారే నీళ్లను చూస్తే తెలుస్తుందని ప్రతిపక్షాల నాయకులకు మంత్రి సూచించారు. సీఎం కేసీఆర్ రైతుల పంటలకు నీళ్ళు అందించాలని త‌మకు అవకాశం ఇచ్చారన్నారు. చివరి రైతు వరకూ నీరందించేలా అధికారులు చొరవ చూపాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement