Thursday, March 28, 2024

నిరుద్యోగుల పాలిట గుదిబండగా కెసిఆర్ ప్రభుత్వం – రేవంత్ రెడ్డి

కామారెడ్డి ప్రభన్యూస్. – పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాల లీకేజీ లో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి ది ప్రధాన పాత్ర అని మంత్రి ఆఫీస్ నుంచి లీకేజీ కుట్ర జరిగిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ తో 30 లక్షల మంది నిరుద్యోగుల బతుకులతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజశేఖర్ రెడ్డి కి ఉద్యోగం ఇప్పించింది కేటీఆర్ పిఏ తిరుపతి అని రాజశేఖర్ పెన్ డ్రైవ్ లో 15 ప్రశ్నపత్రాలు ఉన్నాయని ఆరోపించారు.మంత్రి కేటీఆర్. పి ఎస్ సి. లీకేజీలో తనకి ఏమి సంబంధం లేదని అతి తెలివిగా ప్రవర్తిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
నిరుద్యోగుల పాలిట కెసిఆర్ సర్కారు గుదిబండగా మారిందని ఆరోపించారు. ప్రశ్న పత్రాల లీకేజీ తో సర్వీస్ కమిషన్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది అన్నారు. నిరుద్యోగుల పాలిట రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సమస్యగా మారింది అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పిదాలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన పరిస్థితులు దాపురిoచాయన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మంత్రి కేటీఆర్ ను భర్తరఫ్ చేసి చంచల్గూడా జైలుకు పంపించాలని పిసిసి అధ్యక్షుడు డిమాండ్ చేశారు. పేపర్ లీక్ చేసిన వ్యవహారంలో అరెస్ట్ చేసిన నిందితులను కస్టడీలోకి తీసుకొని వివరాలు ఎందుకు సేకరించలేదని ప్రశ్నించారు. చంచల్గూడా జైలుకు వెల్లి కొందరు వారిని ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించి లొంగదీసుకున్నారన్నారు. అందుకే కేటిఆర్ ప్రెస్ మీట్ అయ్యాకనే వారిని కస్టడీలోకి తీసుకున్నారన్నారు. ఈనెల 13 నుండి 18 వరకు చంచల్గూడా జైలు సందర్శికుల వివరాలు, సిసి ఫూటేజీలు బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కస్టడీలోకి తీసుకున్న వారిని విచారించక ముందే ఇద్దరు నేరానికి పాల్పడ్డారని మంత్రి కేటీఆర్ ఎలా నిర్ధారిస్తారని పిసిసి అధ్యక్షులు ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ ఏమైనా విచారణ అధికార అని ప్రశ్నించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పనిచేసేవారు పోటీ పరీక్షలు రాయడానికి అర్హత లేదని పిసిసి అధ్యక్షులు గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం అందులో పని చేస్తున్న వారు పరీక్షలు రాసుకోవడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 20 మందికి పైగా సర్వీస్ కమిషన్ లో పనిచేస్తున్న వారు పోటీ పరీక్షలు రాశారన్నారు. మాధురి అమెరిక నుండి వచ్చి గ్రూప్ వన్ పరీక్ష రాస్తే మొదటి ర్యాంకు వచ్చిందన్నారు. జూనియర్ అసిస్టెంట్ రజినీకాంత్ రెడ్డికి నాలుగవ ర్యాంకు వచ్చిందన్నారు. కేటీఆర్ కు షాడో మంత్రిగా పి ఏ తిరుపతి ఎదిగాడన్నారు. మంత్రి పిఏ తిరుపతిది, ఏ టు ముద్దాయి రాజశేఖర్ రెడ్డి ది పక్కపక్క గ్రామాలేని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎటు నిందితుడు రాజశేఖర్ రెడ్డికి ఉద్యోగం, ప్రమోషన్ ఇప్పించింది మంత్రి పీ ఏ తిరుపతి అని చెప్పారు. ఇందులో ప్రత్యక్షంగా మంత్రి కేటీఆర్ కు ప్రమేయం ఉందని పిసిసి అధ్యక్షులు ఆరోపించారు. మల్యాల మండలంలో గ్రూప్ వన్ పరీక్షల్లో వందమందికి పైగా 103 కు పైగా మార్కులు వచ్చాయన్నారు. మల్యాల మండలంలో 103 కు పైగా మార్పులు వచ్చిన అభ్యర్థుల వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టి ఎస్ టి ఎస్ ద్వారా రాజశేఖర్ రెడ్డి కి ఉద్యోగం ప్రమోషన్ వివరాలను ప్రభుత్వం బయట పెట్టాలన్నారు. లీకేజీ వ్యవహారంలో కాన్ఫిడేన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి పాత్ర ఉందో లేదో విచారణ చేపట్టాలన్నారు. ఈ విషయం కేటీఆర్ కు తెలుసా లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

శ్రీలక్ష్మి ,ప్రవీణ్ ,వెంకటాద్రి శ్రీదేవి, వాసు, మధులతలకు నిబంధనలకు వ్యతిరేకంగా పరీక్షలకు అనుమతి ఇచ్చారా లేదా అని ప్రశ్నించారు. అనుమతిస్తే అనుమతించిన వ్యక్తుల పేర్లు ప్రభుత్వం బయట పెట్టాలన్నారు. ఒక మంత్రిపేషి లో మంత్రికి తెలియకుండా ఇదంతా జరగదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ మంత్రి కార్యాలయమే అన్ని వ్యవహారాలను చక్కదిద్దిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజీ ఆరోపణల నుండి మంత్రి కేటీఆర్ తప్పించుకోలేరన్నారు.
2016 నుండి ఇప్పటివరకు జరిగిన అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పట్ల సీఎంకు ఇంత బాధ్యత రాహిత్యమా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ బామ్మర్ది రాజుపాకాల, ఏఆర్ శ్రీనివాస్ కున్న బంధుమేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సీట్ కు అప్పగించిన ఏ కేసు ముందుకు సాగలేదని పిసిసి అధ్యక్షులు ఆరోపించారు. పేపర్ లీకేజీ కేసును సిబిఐ కి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు, ఇప్పుడు ప్రశ్నపత్రాల కొనుగోలు, అక్కడ కెసిఆర్ ఇక్కడ కేటీఆర్ పాత్రధారులని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో హైకోర్టులో సోమవారం వాదనలు వినిపిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 21న రాష్ట్ర గవర్నర్ తమిలి సైని కలిసి ఫిర్యాదు చేసి తక్షణమే వారిని ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు పిలుపునిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేద్దాం, తండ్రి కొడుకులను చంచల్గూడా జైలుకు పంపిద్దామని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement