Wednesday, April 24, 2024

కంటి వెలుగును విజయవంతం చేయాలి.. మంత్రి హరీష్ రావు

వికారాబాద్ : రాష్ట్ర ప్రజల కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 18 నుండి ప్రారంభిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేత మహంతి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ లతో కలసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో అందరూ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల్లోని అధికారులు ఉత్సాహంగా పాల్గొనాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా సీరియస్ గా తీసుకొని పని చేయాలన్నారు. జిల్లాల్లో ప్రభావ వంతంగా నిర్వహించేందుకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మొదటి సారి 827 బృందాలు పని చేస్తే, ఇప్పుడు 1500 ఏర్పాటు చేసిందన్నారు.

పరీక్షలు చేసిన నెల రోజుల్లో ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమం పై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా పూర్తి స్థాయి సహకారం ఉంటుందని తెలిపారు. కంటి సమస్యలతో ఏ ఒక్కరూ రాష్ట్రంలో బాధ పడకూడదనే లక్ష్యంతో సీఎం ఉన్నారని తెలిపారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యేలా అందరం కృషి చేద్దామ‌న్నారు. హైదరాబాద్ నుండి హాజరైన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పాల్వాన్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement