Friday, March 29, 2024

పత్తాలేని లక్కీస్కీం నిర్వాహకులు !

కార్యాలయాలు మూత..సభ్యులలో అయోమయం
ప్రభన్యూస్‌ ప్రతినిధి, వికారాబాద్‌ : జిల్లాలోని తాండూరులో తీవ్ర దుమారం రేపుతున్న లక్మీస్కీంల వ్యాపారం కొత్త మలుపు తిరిగింది. పోలీసులకు ఫిర్యాదు అందిన ఫ్రెండ్స్‌ ఎంటర్‌ప్రైజస్‌ కార్యాలయంను మూసివేశారు. ఈ స్కీంలో దాదాపు 3 వేల మంది సభ్యులు ఉన్నారు. తాండూరు..అంతారం రోడ్డు మార్గంలోని ఒక పెట్రోల్‌ బంక్‌కు పక్కన ఉన్న ఫ్రెండ్స్‌ ఎంటర్‌ప్రైజస్‌ కార్యాలయంను మూసివేశారు. దీంతో స్కీంలోని సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కీంలోని సభ్యులు ప్రతినెలా నిర్వాహకులకు రూ.1000 చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు నాలుగు మాసాల పాటు సభ్యులు చెల్లింపులు చేశారు. మొదటి మూడు నెలల పాటు ఒక ఫంక్షన్‌ హాల్‌లో డ్రా తీసిన నిర్వాహకులు గతనెల నుంచి మకాం మార్చారు. చించోలి రోడ్డు మార్గంలోని ఒక ఫంక్షన్‌ హాల్‌లోకి లక్కీడ్రాను మార్చినట్లు సమాచారం. ఫ్రెండ్స్‌ ఎంటర్‌ ప్రైజస్‌ నిర్వాహకులు కొందరు ఫోన్‌లను కూడా స్విచ్‌ఆఫ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ సాగిస్తున్న మోసంపై పోలీసులకు మునిసిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ సాజిద్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సంస్థ నిర్వహిస్తున్న లక్కీస్కీంలోని డొల్లతనంను ఆంధ్రప్రభ వెలుగులోకి తీసుకవచ్చింది. ఇక సరిగ్గా పోలీస్‌స్టేషన్‌ ముందు భాగంలోనే మరో ఎంటర్‌ప్రైజస్‌ కార్యాలయంను ఏర్పాటు చేసి లక్కీస్కీంను నిర్వహిస్తోంది. ఈ కార్యాలయంను మాత్రం దర్గాగా తెరిచి ఉంచారు. పోలీసు శాఖ నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో తాండూరులో లక్కీస్కీంల జోరు కొనసాగుతోంది. ఇటీవల వీటి నిర్వహణపై ఫిర్యాదు రావడంతో కొందరు పెద్దలు జోక్యం చేసుకొని పోలీసు అధికారులు చర్యలు తీసుకోకుండా మంతనాలు సాగించినట్లు ప్రచారం సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement