Friday, April 19, 2024

వికారాబాద్ జిల్లాలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషి : మంత్రి సబితారెడ్డి

వికారాబాద్ జిల్లాలో ప్రెస్ క్ల‌బ్ ఏర్పాటు చేస్తాన‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (టియూడబ్ల్యూజె -ఐజేయు) జిల్లా మహాసభకు మంత్రి సబితారెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, ఐజేయు జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టియూడబ్ల్యూజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అధ్య‌క్షులు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ చారి, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, జిల్లా లైబ్రరీ చైర్మన్ మురళీ కృష్ణ ,జిల్లాలోని జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… జిల్లా కేంద్రమైన వికారాబాద్ లో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి తనకు జర్నలిస్టులతో ఆత్మీయ అనుబంధం ఉందని, కుటుంభ సభ్యుల లాగా ఉంటారన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యలో వారధులుగా సమాజ శ్రేయస్సు కోసం పని చేయటం అభినందనీయమన్నారు. కరోనా సమయంలో కూడా ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తూ ముఖ్య భూమిక పోషించారని, ఆ సమయంలో కొందరిని కోల్పోవటం బాధాకరమన్నారు. వారికి ప్రెస్ అకాడమి తరుపున అండగా నిలిచినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement