Thursday, April 25, 2024

దళిత బంధు గొప్ప పథకం : మంత్రి సబితారెడ్డి

దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతూ, సామాజిక అసమానతలు రూపుమాపటానికి దళిత బంధు పథకం దోహదం చేస్తుందని, ఈ ప‌థకం గొప్ప ప‌థ‌క‌మ‌ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో మొదటి విడతలో ఎంపికైన 100 మంది లబ్దిదారులతో మహేశ్వరం మండల పరిషత్ కాన్ఫరెన్స్ హాల్ లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎంపీపీ రఘుమా రెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి, అధికారులతో కలిసి మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మొదటి విడతలో పైలట్ ప్రాజెక్ట్ గా 100 మందికి ఈ పథకం కింద లబ్ది చేకూరుస్తున్నట్లు, అనంతరం దశలవారీగా దళితులందరికీ అమలు చేస్తామన్నారు.

రంగారెడ్డి జిల్లాలో 698 మందికి 17 కోట్ల 75 లక్షలు దళిత బంధు కింద నిధులు మంజూరయ్యాయన్నారు. మంచి వ్యాపార, ఇతర యూనిట్ లు నెలకొల్పి సక్సెస్ కావాలన్నారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో రాణించిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని, తక్కువ పెట్టుబడితో నేడు విశేషంగా రాణిస్తున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. మార్చి10 వరకు అన్ని యూనిట్లు గ్రౌండ్ చేయాలన్నారు.17 లక్షల కుటుంబాలకు రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేస్తే, జిల్లాలో ఒక లక్ష 18 వేల కుటుంబాలకు ఈ పథకం కింద లబ్ది చేకూరుస్తున్నట్లు మంత్రి తెలిపారు.

నాడు రైతు బంధు ఎలా ఇస్తారని ప్రశ్నించిన వారికి నేడు విజయవంతంగా కొనసాగుతున్న ఆ పథకమే నిదర్శనంగా నిలుస్తుందన్నారు. బడ్జెట్ తర్వాత 2 వేల మందికి నియోజకవర్గాల వారీగా దళిత బంధు పథకం ద్వారా లబ్ది చేకూర్చనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రక్షణ నిధి కూడా ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గతంలో కన్నా ఈ పథకంలో కొన్ని మార్పులు చేసినట్లు, ఎక్కడన్నా వ్యాపారం చేసుకోవచ్చని, కుటుంబంలో సభ్యులు విడివిడిగా రెండు మూడు వ్యాపారాలు చేయవచ్చన్నారు. రెండు మూడు యూనిట్లుగా కూడా పెద్ద వ్యాపారాలు చేయవచ్చన్నారు. గ్రామ స్థాయిలో ఒక అధికారికి ప్రత్యేక బాధ్యతలు ఇవ్వాలని మంత్రి సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement