Tuesday, March 26, 2024

వరుస హత్యల సైకో.. కిల్లర్‌ను ప‌ట్టుకున్న పోలీసులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వరుస హత్యలు చేస్తున్న సైకో కిల్లర్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న మహమ్మద్‌ ఖదీర్‌ అనే సైకోకిల్లర్‌ 2017 నుంచి వరుస హత్యలకు పాల్పడుతున్నాడు. శుక్రవారం నిందితుడు మహమ్మద్‌ ఖదీర్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టి, అతని నేరచిట్టాను హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ వెల్లడించారు.. కర్ణాటక రాష్ట్రం బీదర్‌ నుంచి 15 ఏండ్ల వయస్సులో హైదరాబాద్‌కు నిందితుడు మహమ్మద్‌ ఖదీర్‌ వలస వచ్చాడని, అతని కుటుంబ నేపథ్యం, బాల్యం సరిగా లేదని కమిషనర్‌ చెప్పారు. ఖదీర్‌ ఎప్పుడూ మద్యం మత్తులో ఉంటాడని, మద్యానికి బానిసై సైకో లాగా ప్రవర్తించేవాడని ఆయన తెలిపారు.

నిందితుడు ఖదీర్‌ చేతిలో హత్యకు గురైనవారిలో ఎక్కువగా యాచకులే ఉన్నారన్నారు. మొదట 2017లో ఒక ఆస్తి వివాదం గొడవలో హత్య చేసి అరెస్టు అయ్యాడని, అనంతరం బెయిల్‌పై తిరిగొచ్చాక మళ్లి 2019లో మరో హత్య కేసులో ఖాదీర్‌ అరెస్టు అయ్యాడని ఆయన చెప్పారు. 2021 ఏప్రిల్‌లో తిరిగి బెయిల్‌పై బయటకు వచ్చిన ఖదీర్‌ ఇటీవల దసరారోజు హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మరో హత్య చేశాడని, ఆ తర్వాత అక్టోబర్‌ 31 నాంపల్లి, హబీబ్‌నగర్‌లలో రెండు హత్యలు చేశాడని కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. ఖదీర్‌ కొన్నాళ్ళాలుగా బోరబండలో ఉంటున్నాడని, రోజూ వారీ ఖర్చుల కోసం అడ్డా కూలీగా, ఆటో డ్రైవర్‌గా పని చేస్తుండేవాడని అన్నారు, నిందితుడు ఖదీర్‌ మానసిక స్థితి సరిగా లేదని, సైకోలా ప్రవర్తించేవాడని, చిన్న చిన్న విషయాలకు కూడా గొడవపడే మనస్తత్వం అతనిదని, గొడవ పెద్దదైతే హత్యలకు పాల్పడేవాడని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement