Wednesday, April 24, 2024

గిరిజన మహిళకు ప్రసవ కష్టం

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన మానిపెళ్ళి సుభద్ర అనే గర్భిణీకి ప్రసవ కష్టం ఏర్పడింది. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి నక్కలపల్లి గ్రామానికి వెళ్ళే దారిలో ఉన్న వాగు ఉప్పొంగటంతో ఆ గ్రామానికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. కోటపల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామానికి చెందిన మానిపెళ్ళి సుభద్ర కు నెన్నెల మండలం కోనంపేట గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించగా ప్రసవం కోసం తల్లిగారింటికి వచ్చింది. శుక్రవారం ఉదయం పురిటి నొప్పులు మొదలుకాగా వెంటనే 108కి కాల్ చేశారు. గ్రామానికి వెళ్ళేదారి మద్యలో ఉన్న వాగు భారీ వర్షానికి ఉప్పొంగటంతో వాహనం వాగు దాటలేని పరిస్థితి ఉండటంతో వాగు వద్దే నిలిపి వేశారు. అతి కష్టం మీద ప్రయివేట్ వాహనం సహాయంతో వాగు వద్దకు చేరుకున్న గర్భిణీ వాగు దాటలేక వాగు అవతలి ఒడ్డు వద్దే ఉండిపోయింది. సమయం మించిపోతుండటం, ప్రసవ వేదన తీవ్రం అవుతుందటంతో 108 సిబ్బంది జల మహేశ్, ఫరీద్ అహ్మద్, గ్రామస్తులు ముందుకు వచ్చి ఆ గర్భిణీ ని వాగు దాటించడానికి ముందుకు వచ్చారు. 108 సిబ్బంది అంబులెన్స్ లోని స్టేచ్చర్ ను తీసుకోని అతి కష్టం మీద వాగు దాటి ఆ గర్భిణీని అంబులెన్స్ ఎక్కించి కోటపల్లి PHC కి తరలించే ప్రయత్నం చేశారు.

గర్భిణీ ని ఆసుపత్రికి తీసుకువస్తుండగా పురిటి నొప్పులు తీవ్రం కాగా మద్యలోనె అంబులెన్స్ ను నిలిపివేసి 108 EMT వాళ్ళ ఉన్నత అధికారులకు సమాచారం అందించి వారి సూచనల మేరకు ప్రసవం జరిపించగా ఆ మహిళ బాబుకి జన్మనిచ్చింది. అక్కడి నుండి తల్లిబిడ్డ ఇద్దరినీ కోటపల్లి పీహెచ్సీ కి తరలించారు. అత్యవసర సమయంలో సకాలంలో స్పందించిన 108 సిబ్బంది, గ్రామస్తులకు మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, నక్కలపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో సుమారుగా 6 వరకు గ్రామాలు ఉండగా ఇప్పటివరకు ఈ గ్రామానికి సరైన రహదారి లేదు. కోటపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి నక్కలపల్లి,బద్దంపల్లి, చామనపల్లి, బొమ్మెన గ్రామాలు ఉండగా ఈ మార్గంలో సరైన రోడ్డు, బ్రిడ్జిలు లేక ప్రతి సంవత్సరం ఈ మార్గంలోనే గ్రామ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు, వాగుల పై న బ్రిడ్జి నిర్మాణాలపై పై దృష్టి పెట్టాలని మారుమూల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఇది కూడా చదవండిః పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేటి బంగారం ధరలు ఇలా..

Advertisement

తాజా వార్తలు

Advertisement