Thursday, April 25, 2024

ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారం నుంచి పోడు భూముల ప‌ట్టాల పంపిణీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పోడు భూములకు ఫిబ్రవరి మొదటి వారంలో పట్టాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు, దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే వందశాతం సర్వేను గ్రామసభల ద్వారా పూర్తి చేశామని ఆమె తెలిపారు. పోడు భూములకు సంబంధించి ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను ఫారెస్ట్‌ రైట్స్‌ కమిటీలు, జిల్లా స్థాయి కమిటీల ద్వారా పరిశీలించి లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ గత ఏడాది నుంచి కొనసాగుతోందన్నారు. పోడు భూములకు సంబంధించి ప్రతాలు జారీ చేసే అంశంపై జిల్లా కలెక్టర్లతో సోమవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో అటవీశాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్‌ రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారితో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ పోడు భూములకు పట్టాలివ్వడంతోపాటుగా అడవుల సంరక్షణకు ప్రభుత్వ అంత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఏ జిల్లాల్లోనైతే పోడు భూములకు అధికంగా దరఖాస్తులు అందాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అర్హులైనందరికీ పట్టాలివ్వాలన్నది రాష్ట్ర సీఎం అభిలాష అని, అందుకనుగుణంగా పని చేయాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి సూచించారు.
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో స్థానిక ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వామ్యులను చేయాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో అటవీశాఖ, రెవెన్యూ, సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ అన్నిస్థాయిల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసుకొని పట్టాపాస్‌ పుస్తకాలను ప్రింట్‌ చేసి, ఫిబ్రవరి మొదటి వారానికల్లా సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో పీసీసీఎఫ్‌ డోబ్రియాల్‌, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement