హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దుర్భర స్థితినుంచి పురోగమనం దిశగా సాగునీటి రంగం ఎదిగింది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో భారీ సాగునీటి ప్రాజెక్టులకు వ్యూహరచన చేసి లక్ష్యం చేరుతున్న తరుణంలో కేంద్రం ఇరిగేషన్ ప్రాజెక్టుల రుణాలపై ఇబ్బందులను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గడచిన ఏడేళ్లలో తెలంగాణ సర్కార్ సాగునీటి రంగంపై రూ. లక్షా 52వేల కోట్లను సాహసోపేతంగా వెచ్చించారు. కొత్త ప్రాజెక్టులను ఆధునీకరించడం, కొనసాగుతూ వస్తున్న ప్రాజెక్టులకు నిధుల సమీకరణతో పూర్తి చేయడం వంటి లక్ష్యాలతో సర్కార్ విజయవంతమైంది. తద్వారా ప్రాజెక్టులు జీవం పోసుకుని ఉనికిలోకి వచ్చాయి. రాష్ట్ర అత్యవసరాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం నీటిపారుదల శాఖ పరిధిని పెంచేందుకు బహుముఖ విధానాలను అవలంభించింది. నీటిపారుదల ప్రాజెక్టుల రీ డిజైనింగ్, ఇంజనీరింగ్ కోసం అనేక ప్రణాళికలతో ముందుకు సాగింది. ఇలా రాష్ట్ర నీటిపారుదల స్థాయిని పెంచేందుకు పాలమూరు-రంగారెడ్డి పథకంతో 6 జిల్లాల్లో 12.30లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.74లక్షల ఎకాలకు స;పాగునీరందించేందుకు సీతారామా లిఫ్ట్ ద్వారా గోదావరి నది నీటిని మళ్లించేందుకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది. అదేవిధగా దేవాదుల లిఫ్ట్, కాళేశ్వరం లిఫ్ట్లను కూడా ప్రభుత్వం చేపట్టింది. కాళేశ్వరం మల్లిd స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరొందింది. గోదావరి జలాలను 90మీటర్ల ఎత్తునుంచి 618 మీటర్లకు ఎత్తిపోస్తున్నది. దీంతో 3 బ్యారేజీలు, 20 మెగావాట్ల వాల్యూమ్ వాటర లిఫ్ట్లు ఏర్పాటయ్యాయి. నీటి పారుదల రంగంలో తెలంగాణ సర్కార్ అనుసరించిన ప్రణాళికల కారణంగా 2014నుంచి 2021 వరకు స్థూల నీటిపారుదల శాతం 45శాతం మేర పెరుగుదల నమోదు చేసుకున్నది.
కాగా గడచిన మూడున్నరేళ్లలో కొత్తగా మరో 11 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వచ్చింది. రాబోయే మూడు, నాలుగుమాసాల్లో మరో 10లక్షల ఎకరాలకు సాగునీరందించే పనులు పురోగతిలో ఉన్నాయి. వచ్చే 4ఏళ్లలో 21లక్షల ఎకరాల ఆయకట్టును కొత్తగా సాగులోకి తెచ్చేందుకు జోరుగా పనులు జరుగుతున్నాయి. కృష్ణా, గోదావరి నుంచి న్యాయమైన వాటా దక్కాలంటే, సాగునీటిరంగానికి తెలంగాణ వస్తేనే న్యాయం జరుగుతుందన్న ప్రజల నమ్మకం తెలంగాణ ప్రభుత్వం నిజం చేసింది. కోటి ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రభుత్వం నాలుగంచెల్లో ముందుకు సాగుతోంది. చిన్ననీటి పారుదల రంగం ప్రాధాన్యతకు 46 వేల చెరువుల ఆధునీకరణ, ప్రాజెక్టుల మోడ్రనైజేషన్, గత పాలకులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిన పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టి వాటిని పూర్తి చేయడం, పాలమూరు, కాళేశ్వరం, డిండి, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుల పూర్తికి కృషి చేయడం వంటివే ప్రభుత్వం నిర్దేశించుకున్న నాలుగంచెల విధానంగా అధికారులు చెబుతున్నారు. మిషన్ కాకతీయ దేశంలోనే ఆదర్శంగా నిల్చింది. అనేకమంది, సంస్థలు, మేధావులు, నిపుణులు ప్రశంసించి, ఇతర రాష్ట్రాలు ఈ తరహా పథకాలను ఆచరిస్తున్నాయి. 4దశల్లో 27,713 చెరువులను పూర్తిచేసి 20లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేలా రూ. 8625 కోట్లను మంజూరీ చేశారు. నాబార్డు థర్డ్ పార్టీ విచారణ చేసి 51శాతం చెరువుల కింద విస్తీర్ణం పెరిగిందని, 17శాతం ఎండిన బావుల్లో ఊటలు పెరిగాయని, వరిసాగు పెరిగిందని, 40శాతం రసాయన ఎరువుల వాడకం తగ్గిందని, మత్య్సకారుల ఆదాయంపెరిగిందని, 6లక్షల ఆయకట్టు స్తిరీకరణ జరిగిందని నివేదించించడం దీని గొప్పతనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
1956 నుంచి 2014 వరకు 60 ఏళ్లలో తెలంగాణ భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 26లక్షల ఎకరాల ఆయకట్టే ఉండగా, అవీ కాగితాలకే పరిమితమై వాస్తవంలో లేకుండా పోయిన పరిస్థితి తెలంగాణకు ఎదురైంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నీటి కేటాయింపులను కూడా పెంచుకుంది. 6లక్షల ఎకరాల దేవాదులకు 38 టీఎంసీలనుంచి 60 టీఎంసీలకు, 4లక్షల 20వేల ఎకరాలకునీరందించే కల్వకుర్తిని 20టీఎంసీలనుంచి 40 టీఎంసీలకు నీటి కేటాయింపులను సాధించింది. అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో ఏళ్లు గడిచినా నత్తనడకన నడిచి, భూ సేకరణ జరగక, అటవీ అనుమతులు పొందలేక, రైల్వే క్రాసింగులు, రోడ్డు క్రాసింగులను పూర్తి చేయలేక నిల్చిపోయిన పరిస్థితులు తెలంగాణలో సమూలంగా రూపుమాసిపోయాయి. అంతర్రాష్ట్ర సమస్యలు పరిష్కారానికి సీఎం కేసీఆర్ పలు రాష్ట్రాలికు స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రులతో చర్చించి సమస్యలను పరిష్కరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.