Thursday, April 18, 2024

ప్రభుత్వ భూముల‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలోని బోధన్ శివారులోని పాండు తర్ప వద్ద ప్రజాపయోగ అవసరాల నిమిత్తం ఇది వరకు ప్రభుత్వం సేకరించిన భూములను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఈ భూములకు సంబంధించిన వివరాల గురించి బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. 67 ఎకరాల భూమిని ప్రభుత్వపరంగా సేకరించడం జరిగిందని తెలిపారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల కోసం పది ఎకరాలు, కేంద్రీయ విద్యాలయానికి ఎనిమిది ఎకరాలు కేటాయించారని, వివిధ వర్గాల లబ్ధిదారులకు కూడా ఇక్కడ నివేశన స్థలాలు అందించారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా పాండు తర్ప వద్ద నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను కలెక్టర్ సందర్శించి, రోడ్డు వసతి, ఇతర సదుపాయాలను పరిశీలించారు.

కంటి వెలుగు శిబిరం, నర్సరీల తనిఖీ
బోధన్ మండలం కుమ్మన్ పల్లి గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. ప్రతిరోజు సగటున శిబిరానికి ఎంతమంది నేత్ర పరీక్షల కోసం వస్తున్నారు, సరిపడా కంటి అద్దాలు అందుబాటులో ఉన్నాయా, ఈ శిబిరాల ద్వారా ప్రజలు ఇంకా ఎలాంటి సేవలను ఆశిస్తున్నారు తదితర వివరాల గురించి సిబ్బందిని ఆరా తీశారు. ఎలాంటి పరిమితులు లేకుండా శిబిరాలకు వచ్చిన వారందరికీ మెరుగైన సేవలందించాలని, అవసరమైన వారికి తప్పనిసరిగా కంటి అద్దాలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యానికి మించి కంటి పరీక్షలు నిర్వహించాలని, శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులకు హితవు పలికారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. అనంతరం కుమ్మన్ పల్లి, సాలంపాడ్ గ్రామాల్లోని నర్సరీలను కలెక్టర్ పరిశీలించారు. అక్కడక్కడా మొక్కలు ఎండిపోయి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ నిర్వహణ తీరుపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. వేసవి ఎండలు తీవ్రమవుతున్నందున మొక్కలకు క్రమం తప్పకుండా నీటిని అందించాలని, వేడిమి నుండి కాపాడేందుకు గ్రీన్ షెడ్ లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మొలకెత్తని మొక్కల స్థానంలో మళ్ళీ విత్తనాలు వేయాలని, గ్రామ జనాభా కు అనుగుణంగా సరిపడా సంఖ్యలో నర్సరీలలో మొక్కలు పెంచాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement