Friday, March 29, 2024

రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికే ప్రమాదం. . . – మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్ అర్బన్, మార్చి 25 (ప్రభన్యూస్) : దేశంలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి ప్రశ్నిస్తే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో, దేశాన్ని అభివృద్ధి చేయడంలో రాహుల్ గాంధీ కుటుంబం పాత్ర ఎంతో ఉందని, దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబంలో ఇందిరా గాంధీ ,రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు.

నీరవ్ మోడీ ,లలిత్ మోడీ భారతదేశ సంపదను దోచుకుని విదేశాలకు వెళితే దానిని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీ పై కేసు పెట్టడం సరైనది కాదని అన్నారు. అదానికి 12 లక్షల కోట్ల ప్రజలదనాన్ని నరేంద్ర మోడీ కట్టబెట్టాడని పార్లమెంటులో మోడీకి అదానికి ఉన్న సంబంధం గురించి రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇవ్వలేదని ,పార్లమెంటులో రాహుల్ గాంధీ పై అనర్హత వేయడం చాలా బాధాకరమని దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.

ఎన్నికల సమయంలో జీరో అకౌంట్ ఉన్న ప్రతి ఖాతాలో 15 లక్షలు ఇస్తామని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గెలిచారని ఇలాంటి తప్పుడు హామీలపై ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని, రాహుల్ గాంధీ బిజెపి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తే దానిని ఆపడానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర చేశారని అన్నారు. భారత్ జోడొ పాదయాత్రతో రాహుల్ గాంధీ కి వస్తున్న ప్రజల మద్దతును స్పందనను చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు బిజెపి పూనుకుందని ఆయన అన్నారు.

దేశాన్ని దోచుకున్న వారిని దొంగలు అంటే కేసులు పెట్టడం సరైనది కాదని ఆయన అన్నారు. రాహుల్​ గాంధీని బీజేపీ టార్గెట్​ చేసిందని,రాహుల్ గాంధీ పై లోక్‌సభ సెక్రెటరీ అనర్హత వేటు వేయడం దుర్మార్గం అని, కోర్టు కూడా 30 రోజులు అప్పీల్‌కు టైం ఇచ్చిందిని, అయినా హడావుడిగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం రాజకీయ కక్ష సాధింపులో భాగమే అని,ఈ కుట్రను న్యాయపోరాటం ద్వారా కాంగ్రెస్ ఛేదిస్తుందని సుదర్శన్ రెడ్డి అన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హంధన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పగంగారెడ్డి ,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరికొండ గంగారెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement