Monday, April 22, 2024

ఆర్మూర్ ఆస్పత్రిలో మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ… ప్రతీ వార్డుకెళ్లి వైద్య సేవలపై ఆరా..

నిజమాబాద్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మంగళవారం ఆర్మూర్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్ నిర్వహణ, పారిశుద్ధ్యం వంటి పనుల గురించి ఆరా తీశారు. చికిత్స పొందుతున్న పేషెంట్లను, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలతో మంత్రి మాట్లాడి ఆసుపత్రిలో అందిస్తున్న డైట్ ప్లాన్ గురించి అడిగి తెలుసుకున్నారు. మూడు పూటలా భోజనం అందిస్తున్నారా? లేదా? అనే విషయాలను వాకబు చేశారు. రోగులకు తగినటువంటి పోషికాహారం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆసుపత్రిలో ఫార్మసీ లాబ్ సౌకర్యాలు గురించి తెలుసుకున్న మంత్రి హై ఎండ్ అల్ట్రా సౌండ్ మెషిన్ ఉన్నప్పటికీ టిఫా(టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫ్యూటల్‌ ఎనామిలీస్‌) స్కానింగ్ మెషిన్ అందుబాటులో లేదని చెప్పగా వెంటనే టిఫా స్కాన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కిడ్నీ సంబంధిత పేషెంట్లు డయాలసిస్ సౌకర్యం లేనందువలన నిజామాబాద్‌కి వెళ్లాల్సి వస్తుందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో మంత్రి వెంటనే స్పందించి 10 రోజుల్లో ఏరియా హాస్పిటల్‌లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంతవరకు నార్మల్ డెలివరీలనే చేయాలని మంత్రి వైద్య సిబ్బందికి సూచించారు. మంత్రి వెంట పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.

ఆర్మూర్ వంద పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ అయిన తరువాత తొలిసారి సందర్శనకు వచ్చిన హెల్త్ మినిస్టర్ హరీష్ రావు ప్రతీ వార్డుకెళ్లి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మీపట్ల డాక్టర్లు, సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంటున్నదని మంత్రి అడగగా మమ్మల్ని బాగా చూసుకుంటున్నారని పలువురు రోగులు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు డాక్టర్లు, వైద్య సిబ్బందితో సమీక్ష చేసి ఆసుపత్రికి కావాల్సిన తక్షణ సౌకర్యాల పై చర్చించారు. ఆర్మూర్ దవాఖాన నిర్వహణ అద్భుతంగా ఉందని మంత్రి కితాబు ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చొరవ వల్లే ఆర్మూర్ వంద పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ అయ్యిందన్నారు. జీవన్ రెడ్డి ఆర్మూర్ ఆసుపత్రికే తొలి ప్రాధాన్యత ఇస్తూ అత్యాధునిక సాంకేతిక వైద్య సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొంటూ ఫలితంగా ఆర్మూర్ నియోజకవర్గంలో అత్యాధునిక వైద్యం గ్రామగ్రామానికి చేరువైందన్నారు. ఆర్మూర్ ఆసుపత్రిలో మందుల కొరత లేదని, బయట ప్రయివేట్ దుకాణాలకెళ్లి మందులు కొనాల్సిన పరిస్థితి లేదని ఆయన చెప్పారు. అతి త్వరలో ఈ ఆసుపత్రిలో కేడర్ స్ట్రెన్త్ పెంచుతామని అన్ని విభాగాల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది ఖాళీలు భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధను దృష్టిలో పెట్టుకొని ఈ ఆసుపత్రిలో మరిన్ని అత్యాధునిక వైద్య సౌకర్యాలు పెంచుతామని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా సకల వసతులు కల్పిస్తామని హరీష్ రావు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement