Thursday, March 28, 2024

Nirmal : కేసీఆర్ పాల‌న‌లో కులవృత్తులకు పూర్వ వైభవం : మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్ ప్రతినిధి, ప్రభా న్యూస్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని ఓ ఫంక్ష‌న్ హాల్ లో జ‌రిగిన సంక్షేమ సంబురాలు కార్య‌క్ర‌మంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందుతున్నాయని, సంక్షేమ ఫలాలు పొందని ఇల్లు లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తుంద‌ని తెలిపారు. రైతులకు రైతుబంధు, రైతుభీమా, రైతు భరోసా వంటి పథకాల రూపంలో ఆర్దిక సాయం అందజేస్తోందని వివ‌రించారు. అలాగే దళితులకు దళిత బంధు అందజేస్తోందన్నారు. 2014 కు ముందు అచేతనంగా మారిన కుల వృత్తులకు జీవం పోసింది సీఎం కేసీఆర్‌ నే అన్నారు.

కుల వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగానే నేటి నుంచి కులవృత్తుల కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని సీయం కేసీఆర్ ఇవాళ ప్రారంభిస్తున్నార‌ని తెలిపారు. వెనుకబడిన సామాజికవర్గాల్లోని చేతి వృత్తులు, కులవృత్తులు నిర్వహించే మేదరి, కమ్మరి, రజక, నాయి బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణుల అభ్యున్నతికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని, దీన్ని ప్రతి ఒక్క‌రూ వినియోగించుకోవాలని కోరారు. గ‌త ప్రభుత్వాలు కంటి తుడుపుగా ఇచ్చిన రెండువందల రూపాయల పింఛన్‌ను ఆసరా కింద రూ. 2,016, దివ్యాంగులకు రూ. 3,016 పెంచడం ప్రజల కష్టాలెరిగిన ప్రజా పాలకుడు కెసిఆర్‌తోనే సాధ్యమైందని పేర్కొన్నారు. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు,ఫైలేరియా బాధితులకు, డయాలసిస్ రోగులకు సైతం రూ. 2,016 పింఛన్ ప్రతి నెలా ఠంచన్ గా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ‌యేని స్ప‌ష్టం చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తున్నామ‌న్నారు. చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ వంటి పథకాలతో చేతి వృత్తులకు, కుల వృత్తులకు కేసీఆర్ స‌ర్కార్ భరోసా కల్పిస్తుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement