Monday, March 25, 2024

ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త హెల్త్‌ స్కీం..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు త్వరలో పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం(ఈహెచ్‌ఎస్‌)ను పూర్తి స్థాయిలో అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తుస్తుంది ప్ర‌భుత్వం. త్వ‌ర‌లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేట్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఎటువంటి వైద్య సేవలు అందడంలేదు. ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ పథకం అమలులో ఉంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో 13 వెల్‌నెస్‌ సెంటర్లు ప్రారంభించారు. మెరుగైన చికిత్స అవసరమైన పక్షంలో ఈహెచ్‌ఎస్‌లో ఎంప్యానల్‌ అయిన ఆస్పత్రులకు రిఫర్‌ చేసేవాళ్లు. దీంతో ఉద్యోగులు కార్పోరేట్‌ చికిత్సను పొందేందుకు అవకాశం ఉండేది.

కానీ కరోనా తర్వాత రెండేళ్లుగా ఇవన్నీ స్తంభించాయి. బిల్లులు రావడంలేదనే సాకుతో ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు ఉద్యోగులకు వైద్య సేవలందించడం లేదు. ఉద్యోగులు స్వయంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి వైద్యఖర్చుల బిల్లులను తమ విభాగాధిపతికి సమర్పిస్తున్నారు. ఆ బిల్లులను ప్రభుత్వం రీయంబర్స్‌ చేస్తోంది. ఈ ప్రక్రియ క్లిష్టంగా మారిందని ఉద్యోగ సంగాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. ఈహెచ్‌ఎస్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈహెచ్‌ఎస్‌కు తమ మూల వేతనం నుంచి 1శాతం చొప్పున ప్రతినెలా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో 1 శాతం కాంట్రిబ్యూసన్‌ జీవో దిశగా సర్కార్‌ యోచిస్తోంది. ఈ జీవోతో ఈహెచ్‌ఎస్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా కార్పొరేట్‌ సేవలు అందుతాయి. ఉద్యోగులు, పెన్షనర్లు చనిపోతే అంత్యక్రియల ఖర్చు రూ.10 వేలను రూ.25 వేలకు పెంచారు. అన్ని వర్గాలనూ ఆదరిస్తున్న కేసీఆర్‌ సర్కార్‌ ఉద్యోగుల సమస్యలపై కూడా దృష్టి సారించింది. పీఆర్సీ పెంపుతో కూడిన వేతనాలను అందిస్తున్న ప్రభుత్వం ఇతర ఇబ్బందులను కూడా సానుకూలంగా పరిష్కరించేందుకు సమాయత్తమవుతున్నది.

1శాతం కాంట్రిబ్యూషన్‌తో ఉద్యోగుల వేతనాల నుంచి సమకూరే నిధితో నూతన ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని వర్తింపజేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వానికి అయ్యే వ్యయం. ఇతర సమస్యలను ఆర్థిక శాఖ నుంచి సేకరించినట్లు తెలిసింది. ఈ పథకం అమలులోకి వస్తే పరిమితిలేని వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్‌ సమావేశంలో కీలక నిర్ణయం ప్రకటించనున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement