Thursday, March 28, 2024

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవాలందించాలి – కలెక్టర్ పమేలా సత్పతి

యాదాద్రి : ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు ఒక కుటుంబం లాగా వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం స్థానిక భువనగిరి ఏరియా ఆసుపత్రిలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఒక రోజు హెల్త్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంధర్బంగా కలెక్టరు పమేలా సత్పతి మలేరియా, క్షయ, లెప్రసీ, ఆయుష్, ఆయుర్వేదం, యోగా, యునాని శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. మేళాలో పాల్గొన్న ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. సంక్రమిక, అసంక్రమిక వ్యాధుల నివారణ, నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ మేళా ముఖ్య ఉదేశ్యమ‌ని అన్నారు. ఒక్క రోజే కాకుండా ఏరియా ఆసుపత్రులతో పాటు కమ్యూనిటీ, ప్రాథమిక హెల్త్ సెంటర్లలో వైద్య పరీక్షలు కంటిన్యూ చేయాలని, వివిధ విభాలుగా వున్న అన్ని హెల్త్ సెంటర్లు ప్రజలకు ఒక కుటుంబం లాగా వైద్య సేవలందించాలని సూచించారు. వ్యాధి వచ్చిన తరువాత బాధపడేదాని కన్నా వ్యాధి రాకముందే ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలను కోరారు. జాతీయ ఆరోగ్య పాలసీ లక్ష్యాలకు అనుగుణంగా అందరికీ ఆరోగ్య సేవలందించే దృక్పథంతో ఏర్పాటైన ఆయుష్మాన్ భారత్ క్రింద హెల్త్ కార్డులు అందించడం జరుగుతుందని, తద్వారా ఉచిత వైద్య సహాయం పొందవచ్చునని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని వైద్య అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివరావు, నూతనంగా జిల్లాకు బదిలీ అయిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు, భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కోఆర్డినేటర్ డాక్టర్ చిన్నా నాయక్, ఉప వైద్య అధికారులు డాక్టర్ శిల్పిని, డాక్టర్ యశోద, జిల్లా క్షయ, లెప్రసీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ పాపారావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ పరిపూర్ణ చారి, వైద్య అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement