Thursday, April 25, 2024

బీజేపీని ప్రజలు బొంద పెట్టడం ఖాయం: ఎమ్మెల్యే గాదరి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని  చెప్పిన మోదీ.. వ్యవసాయ పెట్టుబడిని రెట్టింపు చేసి రైతులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. రైతుల నడ్డి విరిచే విధంగా ఎరువుల ధరలను వంద శాతం పెంచడం దుర్మార్గం అని అన్నారు. దీనికితోడు పెట్రోల్, డిజీల్ ధరలు పెంచడం రైతాంగానికి నష్టం జరుగుతుందన్నారు. గత 90 రోజుల్లో ఎరువుల ధరలను డబుల్ చేశారని ధ్వజమెత్తారు. ఎరువుల ధరలు పెరిగితే..ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలన్నారు. రైతులపై భారం పడకుండా సబ్సిడీ కేంద్రం ఇవ్వాలన్నారు.

ఎరువుల ధరల భారాన్ని రైతులపై మోపడం కేంద్రానికి తగదన్నారు. వ్యవసాయంలో ఎస్ఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేయడంలో మోదీ సర్కార్ విఫలమైందని విమర్శించారు. మోటార్ల వద్ద మీటర్లను పెడతామమంటూ రైతులపై మరో భారం మోపాలని కేంద్రం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ వ్యవసాయాన్ని తీసుకురావాలని చూస్తున్న బీజేపీ కుట్రను రైతులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం బృహత్తర పథకాలను సీఎం కేసీఆర్ తీసుకువచ్చారన్నారు. రైతాంగానికి మేలు జరిగే విధంగా సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. మోడీ పతనం ప్రారంభం అయిందన్న ఎమ్మెల్యే కిశోర్.. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని ప్రజలు బొంద పెడతారని జోస్యం చెప్పారు. రైతు వ్యతిరేక మోడీని రాజకీయంగా పాతరేయాలని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement