Thursday, April 25, 2024

అర్బన్‌ ఫారెస్టు బ్లాకులతో అద్భుతాలు, హైదరాబాద్‌లో 109 పార్కుల ఏర్పాటు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణకు మణిహరం అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాకులను ప్రభుత్వం తీర్చిదిద్దింది. అహ్లాదం పంచడంతో పాటు పర్యావరణ బాధ్యత పెంచేలా రాష్ట్ర మంతటా బ్లాకులను ఏర్పాటు చేసింది. పెరిగిన పట్టణ ప్రజల అవసరాలకు తగినట్లుగా ఆహ్లదకర వాతావరణంతో పర్యావరణ హతం కల్గించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు గారి నాయకత్వంలో ప్రభుత్వం అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాకుల అభివృద్దికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరీరక్షణకు, పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణకు హరితహారంలో భాగంగా రాజధాని హైదరాబాద్‌ చుట్టుపక్కలతో పాటు, రాష్ట్ర మంతటా పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో కొద్ది భాగాన్ని అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులుగా అభివృద్ది చేస్తోంది. గ్లోబల్‌ సిటి #హదరాబాద్‌ నగరానికి పర్యావరణ అవసరాలు తీరేలా మొదటి దశలో 109 అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాకుల అభివృద్ధికి చర్యలు తీసుకుంది. అటవీ బ్లాకుల అభివృద్ధికి వివిధ సంస్థలు, వ్యక్తులు వీటిని దత్తత తీసుకొని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో 59 పూర్తి కాగా మిగిలిన 50 వివిధ దశలో ఉన్నాయి. హేచ్‌.ఎం.డీ.ఏ పరిధిలో మొత్తం 59 పార్కులు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 39 పార్కులు ఇప్పటికే పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని పార్కులు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి. మరో 20 వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తం 59 లో అటవీ శాఖ 27,హెచ్‌ఎండీఏ 16, టీఎస్‌ఐఐసీ 7, ఎఫ్‌ డీ సీ 4, జీహెచ్‌ ఎంసీ 3, మెట్రో రైల్‌ 2 పార్కులను అభివద్ది చేస్తున్నాయి. ప్రతీ అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులో తప్పని సరిగా ఎంట్రీ గేట్‌, వాకింగ్‌ పాత్‌, వ్యూ పాయింట్‌ ఏర్పాటు మొదటి దశలో ఉండాలని, అటవీ ప్రాంతం అంతా రక్షణ గోడ లు నిర్మిస్తున్నారు తరువాత దశలో పిల్లల ఆట స్థలం, యోగా షెడ్‌, సైక్లింగ్‌, వనదర్శిని కేంద్రం లాంటి సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యతను ఇవ్వనున్నారు..

పార్కుకాకుండా మిగిలిన స్థలం కన్జర్వేషన్‌ జోన్‌..
పార్కు ఏర్పాటు కాకుండా మిగతా అటవీ స్థలాన్ని అంతటినీ కన్జర్వేషన్‌ జోన్‌ గా పునరుద్దరణ కార్యక్రమాలు, జీవవైవిధ్యం నీటి వసతి పెరిగే కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. #హరితవనాల పేరుతో కన్జర్వేషన్‌ జోన్లలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతోంది. వందశాతం చిక్కటి అడవి పెరిగేలా, స్థానిక స్థలం, మట్టి స్వభావం, వాతావరణ పరిస్థితి ఆధారంగా పెరిగే మొక్కలను మాత్రమే నాటుతున్నారు. అర్బన్‌ పార్కులను గాంధారి వనం, ప్రశాంతి వనం, అక్సిజన్‌ పార్క్‌, శాంతి వనం, ఆయుష్‌ వనం, పంచతత్వ పార్క్‌ తదితర ధీములతో అభివృద్ధి చేస్తున్నారు.

హైదరాబాద్‌లో పెరిగిన పచ్చదనం…
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వలన #హదరాబాద్‌ నగరంలో ఫారెస్ట్‌ కవర్‌ 33.15 చదరపు కిలో మీటర్ల నుండి 81.81 చదరపు కిలో మీటర్ల (147 శాతం) పెరిగింది. తద్వారా పర్‌ క్యాపిటా ఫారెస్ట్‌ కవర్‌ 4.3 నుండి 8.2 చదరపు మీటర్లకు పెరిగింది. అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధిని వరల్డ్‌ ఫారెస్ట్‌ సైన్స్‌ గుర్తించడం #హదరాబాద్‌ నగరానికి గర్వకారణమని పలువురు పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌ నగరంలో పచ్చదనం పెంపుదలతో పాటు నగరవాసులను కాలుష్యం బారినుంచి కాపాడడానికి ఆటవీశాఖ, మున్సిపల్‌ శాఖలు నిరంతరం శ్రమిస్తున్నాయి. హైదరాబాద్‌ నగరానికి ఎఫ్‌.ఏ.ఓ నుండి ట్రీ సిటీ ఆప్‌ ద వరల్డ్‌ ట్యాగ్‌ లభించడానికి విశేషంగా కృషిచేశారు. 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌ కేటాయించడంతో పాటు జి.హెచ్‌.ఎం.సీ, హెచ్‌.ఎం.డి.ఏ సి.డి.ఎం.ఏ పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం తోపాటు నర్సరీల పెంపునకు ప్రాధాన్యతనిస్తున్నారు. జిహెచ్‌ఎంసీ పరిధిలో అవెన్యూ, మల్టి లేయర్‌, సెంట్రల్‌ మీడియన్లు నోడల్స్‌, స్మశానాలు, కాలనీలు, చెరువులు, ఖాలీస్థలంలో, తదితర ప్రాంతాలు మొక్కలు నాటారు. సి.డి.ఎం.ఏ ద్వారా పట్టణ ప్రకృతి వనాలు, బృహత్‌ పట్టణ ప్రకృతి వనాలు, ఎం.ఎల్‌.ఏ.పి(మల్టిలెవల్‌ ఎవెన్యూ ప్లాంటేషన్‌), హెచ్‌.ఎం.డి.ఏ ద్వారా డ్రిప్‌, రోటరీలు, అవుటర్‌ రింగ్‌ రోడ్డు, రైల్వే కారిడార్‌, సర్వీస్‌ రోడ్స్‌ వెంబడి పచ్చదన అభివద్ధికి చర్యలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఈ అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు పట్టణ ప్రాంతాలకు స్వచ్చమైన ఆక్సీజన్‌ ను అందించే అర్బన్‌ లంగ్స్‌ స్పేసెస్‌గా మారనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement