పోలీసు తుపాకిని తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు తెలంగాణ అబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్..దాంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. పోలీసుల చేతుల్లోని ఎస్ఎల్ఆర్ తుపాకీని తన చేతుల్లోకి తీసుకున్న ఆయన జనమంతా చూస్తుండగానే గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసు తుపాకీని తన చేతుల్లోకి తీసుకున్న మంత్రి గాల్లోకి కాల్పులు జరుపుతున్న సమయంలో పోలీసు ఉన్నతాధికారులు అక్కడే ఉన్నా… ఆయనను వారించకపోవడం గమనార్హం.
పోలీసు తుపాకీతో కాల్పులు జరపడంతోనే ఆగిపోని శ్రీనివాస్ గౌడ్… ఆ ఫొటోలను ఎంచక్కా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.ఈ ఫొటోలు, వీడియోలను చూసిన నెటిజన్లు.. పోలీసుల తుపాకీతో మంత్రి గాల్లోకి ఎలా కాల్పులు జరుపుతారంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల పేరిట తెలంగాణ సర్కారు కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడమ్ ర్యాలీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో జరిగిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి హోదాలో శ్రీనివాస్ గౌడ్ పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగానే ఆయన పోలీసు తుపాకీని తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు.