Friday, March 29, 2024

జల చౌర్యం ఆపండి.. లేదంటే యుద్ధమే: ఏపీకి తెలంగాణ మంత్రి వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ నీటి చౌర్యాన్ని తప్పకుండా అడ్డుకుంటామని మంత్రి పువ్వాడ అజయ్‌ స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారని చెప్పారు. బేసిన్లు, భేషజాలకు పోకుండా న్యాయం చేద్దామని, గోదావరి జలాలను సమృద్ధిగా వినియోగించుకుందాని కేసీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. రాయలసీమకు నీళ్లు ఇస్తామనే మాటలను ఏపీ వక్రీకరిస్తున్నదని ఆరోపించారు. రెండు రాష్ట్రాల నీటి వాటాలు ఇంకా తేలలేదని తెలిపారు. వైఎస్‌పై మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాటలు వంద శాతం నిజమని చెప్పారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం తాము మాట్లాడుతున్నామన్నారు. వైఎస్‌ హయాంలో అద్భుతమైన ప్రాజెక్టులు కట్టామని చెబుతున్నారని, ఖమ్మం జిల్లాలో ఒక్క ఎకరానికైనా నీరు వచ్చిందా అని ప్రశ్నించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదని చెప్పారు.

తెలంగాణ పట్ల తండ్రికి మించిన తనయుడు జగన్మోహన్‌ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తెలంగాణ సమాజాన్ని చిన్నచూపు చూశారన్నారు. పోతిరెడ్డిపాడు అంశపై తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేసీఆర్‌ పోరాటం చేశారన్నారు. కేంద్రానికి అబద్దాలు చెబుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతున్నదని విమర్శించారు. బీజేపీ నేతలు ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్జీటీ తీర్పును ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సీఎం కేసీఆర్‌ మాటలకు వక్రభాష్యం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిబున్యల్ వెంటనే ఇరు రాష్ట్రాల నీటివాటాను తేల్చాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: రాయలసీమకు నీరిస్తామని కేసీఆరే చెప్పారు: మంత్రి పెద్దిరెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement