Thursday, April 18, 2024

ప్రజల‌ కష్ట్టాలే మా ఎజెండా.. అంతిమంగా వాళ్లకే మద్ద‌తిస్తారు: మంత్రి హరీష్

ప్రతీ పేదవాడి కడుపు నింపడమే‌ సీఎం కేసీఆర్ లక్ష్యం అని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. గజ్వేల్ లో కొత్త రేషన్ కార్డులు, కళ్యాణ‌ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు మంత్రి హరీష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాము నూతనంగా 3,09,083 రేష‌న్‌ కార్డులను అందిస్తున్నామ‌ని చెప్పారు. దీని వ‌ల్ల‌ 8,65,430 మంది లబ్ధి పొందుతున్నార‌ని చెప్పారు. అలాగే, త‌మ సర్కారు నెలకు అదనంగా 14 కోట్ల రూపాయ‌ల‌ విలువగల 5,200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తోంద‌ని తెలిపారు. సంవత్సరానికి రేషన్ పై రూ. 2766 కోట్ల నిధుల్ని వెచ్చిస్తోందని చెప్పారు. అదనంగా ఇచ్చిన కొత్త కార్డులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో అన్నిరకాల కార్డులు దాదాపు 90.50 లక్షలు ఉన్నాయ‌ని, లబ్ధిదారులు 2 కోట్ల 88లక్షల మంది ఉన్నారని మంత్రి చెప్పారు. ప్రతి నెల దాదాపు 231 కోట్ల రూపాయ‌ల‌ను, సంవత్సరానికి 2,766 కోట్ల రూపాయలను ప్రజాపంపిణీ కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు.

రాష్ట్ర జనాభాలో 90.5 శాతం మంది ప్రజలకు ప్రభుత్వం రేషన్ బియ్యం అందిస్తోందన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇలా 90.5 శాతం ప్రజలకు బియ్యం ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి పథకం వద్దని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత 16 రాష్ట్రాల్లో ఇలా పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం అందిస్తున్నారా అని నిలదీశారు. టీఆర్ఎస్ ఎన్నికల కోసమే పనులు‌చేస్తుందని కొందరు విమర్శలు చేయడాన్ని ఖండించారు. టీఆర్ఎస్ తెలంగాణ కోసం, ప్రజల కోసం పని చేసే పార్టీ అని చెప్పారు. ప్రజలు తెలివైన వారు, అంతిమంగా పని చేసే వాళ్లకే తమ మద్ధతిస్తారని తెలిపారు. ప్రజల‌ కష్ట్టాలే తమ ఎజెండా అని మంత్రి హరీష్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement