Thursday, April 25, 2024

గోదావరి నీళ్లతో తెలంగాణ భీడు భూములకు జీవం..

మెదక్‌ : గోదావరి నీళ్లు.. తెలంగాణ బీడు భూములకు మళ్లించి జీవం కోల్పోయిన ఎన్నో చెరువులు.. కాలువలు.. ఉపనదులకు పునరుజ్జీవనం కల్పించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేసిన ప్రణాళిక ఫలితంగా మెదక్‌ జిల్లాలో చెరువులకు, కాలువలకు, చెక్‌డ్యామ్‌లకు జలకళ వచ్చింది. మంజీరపై మొదటి చెక్‌డ్యామ్‌ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించి చెక్‌డ్యామ్‌ల ప్రాధాన్యతను గుర్తించేలా చేసి తద్వారా మంజీర, హల్ది పరివాహకంలో పదుల సంఖ్యలో చెక్‌డ్యామ్‌లు నిర్మాణం అయ్యేలా కృషి చేసిన కేసీఆర్‌ ప్రియశిష్యుడు, ఉద్యమ కాలం నుండి ముఖ్యమంత్రితో 22 సుదీర్ఘ ప్రయాణం చేసిన కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి శేరిసుభాష్‌రెడ్డి కాళేశ్వరం నీరు మంజీర ద్వారా నిజాంసాగర్‌లోకి వెళ్తున్న సందర్భంగా స్థానిక పత్రిక ప్రతినిధులతో చిట్‌చాట్‌ చేశారు..
ప్రశ్న: మంజీరాపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ వల్ల కాళేశ్వరం జలాలతో ఎంత మేర ప్రయోజనం చేకూరనుంది?
జవాబు: కొండ పోచమ్మ సాగర్‌ నుండి 4 పెద్ద చెరువులు, 70 కిలోమీటర్ల హల్దివాగులో 30 చెక్‌డ్యాంలు, బొల్లారం మత్తడి, మంజీరలో పూర్తయిన చెక్‌డ్యామ్‌, నిర్మాణంలో ఉన్న చెక్‌ డ్యామ్‌ 40 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 70 కిలోమీటర్ల హల్దీ, మంజీరాలలో ఎటు 3 కిలోమీటర్ల మేర భూగర్భ జలాల నీటిమట్టం పెరగనుంది. హల్దీద్వారా వర్గల్‌ నుండి మొదలై కాళేశ్వరం జలాలు తూప్రాన్‌, మూసాయిపేట, వెల్దుర్తి, ఘణపూర్‌, పాపన్నపేట మండలాల ద్వారా నిజాంసాగర్‌లోకి వెళ్తుంది. వేలాది ఎకరాలకు లబ్ది చేకూరనుంది.
ప్రశ్న: వేసవి కాలంలో కాళేశ్వరం జలాలు మెదక్‌ జిల్లాకు వస్తాయని ఎవరైనా ఊహించారా?
జవాబు: వాస్తవం ఐతే ఇది ఊహకు అందని విషయం. ఇది కేవలం తెలంగాణ రైతాంగాన్ని ఆర్థికంగా ఎదిగేలా చేయడానికి అపర భగీరథుడు కేసీఆర్‌ ముందు చూపు ఫలితమే. 22 యేళ్లపాటు కేసీఆర్‌ వెంట ఉన్న ఓ నిబద్దత గల కార్యకర్తగా నేను మాత్రం కేసీఆర్‌ గోదావరి నీళ్లను మెదక్‌ జిల్లాకు తప్పకుండా తెప్పిస్తారని నమ్మాను. ఎందుకంటే కఠోర ప్రయత్నం వల్ల అనితర సాధ్యమైన ప్రాజెక్టుల నిర్మాణం 3 యేళ్లలో పూర్తయినందుకు, కేవలం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ద వల్ల 3 యేళ్లలో పూర్తయినందుకు ఆయన శిష్యుడిగా గర్వంగా ఉంది.
ప్రశ్న: కాళేశ్వరం నీరు రెండు పంటలకు నిరంతర వ్యవసాయానికి అందుబాటులో ఉంటాయా?
జవాబు: ఖచ్చితంగా ఉంటాయి, ముఖ్యమంత్రి ప్రయత్నమంతా రైతు గర్వంగా సమాజంలో తలెత్తుకొని బతకాలన్నదే ఆయన ఆశ. ఐతే 2 పంటలకు నీరు అందించడం మూలంగా ఇక్కడ నీటి కొరత రాదు. కానీ రైతులు కూడా ఒకే పంట వేయాలన్న ఆలోచన కాకుండా విభిన్న పంటలు వేయడడం ద్వారా మరింత అభివృద్ది చెందుతారని ఆ వైపు రైతాంగం ఆలోచించాలని ఆయన కోరారు.
ప్రశ్న: ఎక్కడైనా నది నీళ్లు ఉపనదిలో కలిసిన సందర్భాలున్నాయా?
జవాబు: నాకు తెలిసి ఎక్కడైనా ఉప నదులే నదులకు జీవదారలుగా ఉంటాయి. కానీ గత పాలకుల నిర్లక్ష్య దోరణి వల్ల ఉపనదులన్ని ఒట్టి పోయాయి. కొన్ని చోట్ల నీటి లభ్యత లేక పిచ్చి మొక్కలతో నిండాయి. ప్రపంచంలో ఎవరు ఊహించని విధంగా ఉప నదులను కూడా జీవనదులుగా మార్చిన ఘనత కేసీఆర్‌ గారిదే. బృహత్తర ప్రణాళికతో ఉప నదుల్లో నిర్మించిన చెక్‌ డ్యాంల వల్ల గొలుసు కట్టులా నీటి ప్రవాహం ఎక్కడికక్కడే నిలువ ఉండటం మూలంగా కిలోమీటర్ల మేర నీరు నిలవడం, తద్వారా వేల ఎకరాల సాగుకు అవకాశం లభించింది.
ప్రశ్న: కాళేశ్వరం జలాల వల్ల పర్యావరణం ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు?
జవాబు: ఈ నదుల ద్వారా నది పరీవాహక ప్రాంతమంతా నీటి లభ్యత ఉండటం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. జలకళ ఉంటే వృక్ష సంపద, మత్య్ససంపద, జీవ సంపద, పక్షుల సంచారం పెరుగుతుంది. పల్లెలో రైతులు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉండటంతో వలసలు తగ్గుతాయి. ఇంత గొప్ప రీతిలో నీటి లభ్యత ఏర్పరిచిన కేసీఆర్‌ కి అందరి ఆశీర్వచనాలు ఉంటాయి.
ప్రశ్న: మంజీరాపై మొదటి చెక్‌ డ్యామ్‌ నిర్మించడం ఆ నిర్మాణం ప్రయోజనాల మూలంగా మరిన్ని చెక్‌డ్యామ్‌లు మంజూరు కావడం పట్ల మీ అనుభూతి ఏంటి?
జవాబు: మంజీరలో గతంలో జిల్లా ప్రజలు కాంగ్రెస్‌, టిడిపిల ప్రభుత్వ హయాంలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం కోసం విన్నవించినా అప్పటి పాలకులు సీమాంధ్ర తొత్తులుగా ఉండి వీటి గూర్చి పట్టించుకోలేదు. వర్షకాలంలో వచ్చే వరద నీటిని సైతం నిలుపుకోలేక ప్రజలకు అవస్థలు ఏర్పడ్డాయి. ప్రజల పరిస్థితి గమనించి ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ తెలంగాణ రైతాంగాన్ని కాపాడే ఉద్దేశ్యంతో చేస్తున్న కృషిని దగ్గరగా చూశాను. మా జిల్లాలో కూడా చెక్‌డ్యామ్‌ ఆశవ్యకతను పెద్దసార్‌ దృష్టికి తీసుకెళ్లగా అడిగిన వెంటనే కూచన్‌పల్లిలో మంజీర నదిపై తొలి చెక్‌డ్యామ్‌ మంజూరు ఇచ్చారు. 4 నెలల కాలంలో పూర్తి చేయించాం. దాని ఫలితంగా 5 కిలోమీటర్ల మేర నీటి నిల్వ ఏర్పడి 8 గ్రామాల ప్రలకు ప్రయోజనం చేకూరింది. ఒక చెక్‌డ్యామ్‌ నిర్మాణం వల్ల జరిగిన ప్రయోజనమే. మరో 12 చెక్‌డ్యామ్‌లు నిర్మాణంకు కారణమవ్వడం ఆనందంగా ఉంది. ఎక్కడైతే సాగు నీరు లభ్యత ఉంటుందో అక్కడ రైతులు, అన్ని రకాల జీవన వ్యవస్థ సుభిక్షంగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement