Thursday, April 25, 2024

కేసీఆర్‌కు వంటేరు ప్రతాప్‌రెడ్డి వినతి..

శివ్వంపేట : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని తూప్రాన్‌ మండలంలో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్ల నుండి హల్దీవాగు ద్వారా నీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని రాష్ట్ర ఫారెస్టు కార్పోరేషన్‌ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డితో మొరపెట్టుకున్నారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం యావాపూర్‌ గ్రామంలో పంటలు ఎండిపోతున్నాయంటూ ప్రతాప్‌రెడ్డితో మొరపెట్టుకున్నారు. రైతుల పిలుపు మేరకు ప్రతాప్‌రెడ్డి పంట పొలాలను పరిశీలించారు. పంటపొలాలను పరిశీలించిన అనంతరం ప్రతాప్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రైతుల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్‌కు మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్ల ద్వారా నీటిని అతి త్వరగా విడుదల చేయాలని కోరారు. హాల్దీవాగు ద్వారా త్వరలోనే పంటపొలాలకు నీరు అందిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపినప్పటికీ ఎండ తీవ్రత పంటపొలాలు ఎండిపోతున్న సందర్భంగా రైతుల విజ్ఞప్తి మేరకు అతిత్వరలో నీటిని విడుదల చేయాలని వంటేరు ప్రతాప్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ బొంది రవీందర్‌గౌడ్‌, ఎంపిపి గడ్డి స్వప్న వెంకటేష్‌యాదవ్‌, వైస్‌ ఛైర్మన్‌ నందాల శ్రీనివాస్‌, కౌన్సిలర్లు శ్రీశైలంగౌడ్‌, తెరాస పార్టీ మండల అధ్యక్షులు బాబుల్‌రెడ్డి, సర్పంచ్‌ నర్సింహారెడ్డి, నాయకులు సత్యనారాయణగౌడ్‌, మన్నే శ్రీనివాస్‌, సతీష్‌చారి తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement